జగన్ సొంత పార్టీ ఆలోచన?
వైయస్ హయాంలో కాంగ్రెసు ముద్రతో ప్రారంభమైన 'సాక్షి' పత్రిక ఇప్పటి కాంగ్రెసు ప్రభుత్వానికి ప్రతిపక్షంలా మారింది. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ద్ధి పథకాలను రోశయ్య ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని విమర్శలు గుప్పిస్తోంది. గతంలో వైయస్ 'ఆ రెండు పత్రికలు' అంటూ మాటిమాటికి ఈనాడును, ఆంధ్రజ్యోతిని విమర్శించేవారు. అది సాక్షి పెట్టక ముందు సంగతి. సాక్షి వచ్చిన తర్వాత అది ప్రభుత్వ పత్రికగా అభివృద్ధి కార్యక్రమాల గురించి అనుకూలంగా రాస్తుండడంతో ఆ రెండు పత్రికలను పెద్దగా పట్టించుకోవలసి అవసరం ఆయనకు లేకుండా పోయింది. ఇప్పుడు రోశయ్య ప్రభుత్వంపై సాక్షిలో వస్తున్న ఘాటైన కథనాలు కాంగ్రెసు హైకమాండ్ కు కూడా అసహనం కలిగిస్తున్నాయి.
వరదసాయం గురించి హైకమాండ్ తో చర్చించడానికే ఢిల్లీ వచ్చానని రోశయ్య చెబుతున్నప్పటికీ ఆయన జగన్ వర్గంపై ఫిర్యాదుల చిట్టాతో సోనియాను కలవనున్నట్టు తెలిసింది. సొంతపార్టీ మనుషులే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. జగన్ వర్గానికి భయపడే ఆయన మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.