బాబుకు కాళ్ల కిందికి రమేష్ నీళ్లు?
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సిఎం రమేష్ శాసనసభ ఆవరణలో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు నడిపారని చెవులు కొరుక్కుంటున్నారు. ఆ తర్వాత కడప, పులివెందుల ఉప ఎన్నిక టికెట్ సీనియర్లను, పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని బిటెక్ రవికి రావడానికి తెర వెనక కథ నడిపింది కూడా సిఎం రమేషేనని అంటున్నారు. కడప లోకసభ సీటుకు తనకు అనుకూలంగా ఉండే పుత్తా నరసింహా రెడ్డిని తెర మీదికి తెచ్చింది కూడా ఆయనే అంటారు. బలహీనమైన అభ్యర్థులను దించడం ద్వారా కాంగ్రెసుకు అనుకూలంగా మారే వ్యూహాన్ని సిఎం రమేష్ రచించారని అంటారు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు పుత్తా నరసింహా రెడ్డిని పక్కన పెట్టి మైసురా రెడ్డిని లోకసభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశారని అంటారు. ఏమైనా, సిఎం రమేష్ నమ్మినబంటుగా వ్యవహరిస్తూనే పార్టీకి చేయాల్సిన నష్టం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.