గత కొంత కాలంగా అనామకంగా కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు మళ్లీ తెర మీదికి వచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెసులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం తెర తీసిందని అంటున్నారు. గత కొంత కాలంగా కెవిపి దుబాయ్లోని తన కుమారుడి వద్ద ఉంటున్నారు. అయితే, కెవిపి అవసరం ఉందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. వైయస్ జగన్ వెంట వెళ్లే ప్రసక్తి లేదని కెవిపి రామచందర్ రావు కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెసులోనే ఉంటానని చెప్పినప్పటికీ కొంత మంది కాంగ్రెసు నాయకులు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని కెవిపి అలిగి దుబాయ్ వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. జరిగిన మంచిని వైయస్సార్కు ఆపాదిస్తూ, చెడుకు కెవిపిని తప్పు పడుతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దీన్ని బట్టి చెడైనా, మంచైనా వైయస్సార్కు అంటగట్టాల్సిందే తప్ప కెవిపి పాత్రను విమర్శించకూడదని ఆయన చెప్పినట్లైంది. దీంతో కెవిపిపై కాంగ్రెసు నేతల నుంచి ఆరోపణలు రావని స్పష్టమైంది. ఈ స్థితిలో తిరిగి కెవిపి రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. కెవిపి రామచందర్ రావును వైయస్ జగన్ వర్గం ప్రత్యర్థిగా చూస్తుందనేది అంబటి రాంబాబు మాటలను బట్టి అర్థమవుతోంది. ఉండవల్లి బయట పెట్టిన వైయస్సార్ లేఖను సోనియా లేదా కెవిపి ఇచ్చి ఉండాలని ఆయన అన్నారు.