సీటు భయం కూడానా!?: కెసిఆర్ ఢిల్లీ టూర్ వెనుక
కెసిఆర్ కాంగ్రెసు పెద్దల పిలుపు మేరకే ఢిల్లీ వెళుతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. తెలంగాణపై జెఏసి డెడ్ లైన్ పెట్టడం, మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని కెసిఆర్ గతంలో ప్రకటించడం, బిజెపి జోరందుకోవడం, టిడిపి స్పష్టత ఇచ్చేందుకు సిద్ధపడటం వంటి అంశాలు కాంగ్రెసును ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెరాస విలీనం, విభజన అంశాలపై చర్చించేందుకు కాంగ్రెసు నేతలు ఆయనను పిలిపించారనే ప్రచారం జరిగింది.
అందుకు భిన్నంగా తన పర్యటన వెనుక ఎలాంటి ప్రాధాన్యత లేదని, చివరి రెండు రోజులైనా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకే వెళుతున్నానని మామూలుగా చెప్పినప్పటికీ ఆయన హాజరీ నిర్ణయం వెనుక గూడార్థం ఉందట. సాధారణంగా ఓ ఎంపీ వరుసగా అరవై రోజులు సమావేశాలకు గైర్హాజరైతే అతని ఎంపీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. కెసిఆర్ గత సమావేశాల సమయంలో మే 2వ తేదిన చివరిసారిగా సభకు హాజరయ్యారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సభకు గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈసారి జరుగుతున్న సమావేశాలకు ఒక్కరోజు కూడా ఆయన హాజరు కాని పక్షంలో ఆయన అభ్యర్థిత్వం రద్దుకు అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో తన పార్లమెంటు సభ్యత్వం రద్దు బెంగతోనే కెసిఆర్ సమావేశాలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పనిలో పనిగా తెలంగాణపై కాంగ్రెసు పెద్దలతో చర్చించినట్లుగా కూడా ఉంటుందని ఆయన భావించారని చెబుతున్నారు.
కెసిఆర్ ప్రస్తుతం మహబూబ్నగర్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. ఇటీవల ఉప ఎన్నికల్లో పాలమూరులో తెరాసను బిజెపి ఓడించింది. ప్రస్తుతం ఢిల్లీ స్థాయిలో బిజెపి తెలంగాణ కోసం ఉద్యమిస్తోంది. తెలంగాణ కోసం టిఆర్ఎస్తో పాటు బిజెపి కూడా పెద్ద ఎత్తున పోరాడుతుందనే భావన తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే నాటుకు పోయింది. మరోవైపు గత సాధారణ ఎన్నికల్లో కెసిఆర్ స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సభ్యత్వం రద్దయితే ఆయన గెలుపు కష్టమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ భయంతోనే కెసిఆర్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారేమోననే గుసగుసలు వినిపిస్తున్నాయి.