ఎసిబికి కుక్క భయం, అవినీతికి కాపలా
అంజనాదేవి కర్నూలు నగరంలో భాగమైన కల్లూరు మండల తహసీల్దార్గా పనిచేశారు. ఆమె మీద అవినీతి ఆరోపణలు రావడంతోఇంటెలిజెన్స్ వారు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆమెను బదిలీ చేసి, పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో, బుధవారం ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. కర్నూలులో తెల్లవారుజామున రెండు గంటలకే అంజనాదేవి ఇల్లు ఉన్న వీధికి చేరుకున్నారు. రెండుగంటలపాటు మొత్తం పరిసరాలు గమనించారు.
తెల్లవారు జామున 4.30 సమయంలో పదిమంది ఏసీబీ పోలీసులు అంజనాదేవి ఇంటి గేటు తట్టారు. అయితే ప్రవేశద్వారం వద్ద ఆమె పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ జాగిలం అడ్డుతగిలింది. కుక్క అరుపులకు లేచి వచ్చిన అంజనాదేవి 'మీరెవరూ లోపలికి రావొద్దు' అని హుకుం జారీచేశారు. తాము ఏసీబీ అధికారులమని చెప్పినా కుక్కను కట్టేయకుండా బెడ్రూంలోకి వెళ్లి తలుపేసుకున్నారు. కుక్క భయంతో ఏసీబీ అధికారులు గంటవరకు బయటే వేచి చూశారు. తర్వాత పక్కనే ఉన్న రాయలసీమ వర్సిటీ వీసీ కృష్ణనాయక్ ఇంటిలోంచి గోడ దూకి లోపలికి వెళ్లారు. కొద్ది సేపటికి బయటికి వచ్చిన అంజనాదేవి 'మీరు లోపలికి వస్తే పై నుంచి దూకి చచ్చిపోతా' అంటూ బెదిరించారు. ఈ పప్పులేవీ ఏసీబీ ముందు ఉడకలేదు.
అంజనాదేవి నివాసంతోపాటు ఆమె డ్రైవర్, స్నేహితుడు, డాక్యుమెంట్ రైటర్ ఇళ్లల్లో కూడా సోదాలు మొదలుపెట్టారు. అంజనాదేవి ఇద్దరు కూతుళ్లు ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీ-ఫార్మసీ చదువుతున్నారు. వీరి హాస్టళ్లలో ఏసీబీ అధికారులు సోదాచేశారు. అంజనాదేవికి ఒక టింబర్ డిపో, ఒక ఇల్లు, హైవే సమీపాన కోట్ల విలువచేసే స్థలం ఉన్నట్టు గుర్తించారు. ఈమె ఇంటిలో 20 తులాల బంగారు నగలు, మోటారు బైకు, స్కూటీ, కారు డ్రైవర్ పేరు మీద ఉన్న సుమో, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో విలువైన డైమండ్ క్రిస్టల్ కనుగొన్నారు. కర్నూలులోనే ఆమె ఆస్తుల విలువ రూ. కోటి పైనే ఉంటుందని కర్నూలు ఏసీబీ డీఎస్పీ విజయపాల్ తెలిపారు. మార్కెట్ విలువ రూ.10 కోట్ల పైమాటే అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. చివరికి అంజనాదేవిని అరెస్టు చేశారు.