ఎలాగైనా జైలు నుండి రావాల్సిందే: జగన్ లాలూచీ!
ఇటీవల దేశవ్యాప్తంగా ఎఫ్డిఐ వేడి రాజుకున్న విషయం తెలిసిందే. మంగళవారం లోకసభలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక్క అధికార కాంగ్రెసు తప్ప మిగతా అన్ని పార్టీలు ఎఫ్డిఐలను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఒక్క జగన్ పార్టీ మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. జగన్కు కోసమే ఆ పార్టీ ఎఫ్డిఐలపై మాట్లాడటం లేదని, ఆయనకు బెయిల్ తెచ్చేందుకు కాంగ్రెసుతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపిస్తున్నారు.
జగన్ ఇప్పటికే పలుమార్లు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ చుక్కెదురయింది. ఈ వారం రోజుల పరిధిలో నాంపల్లి సిబిఐ కోర్టులో స్టాట్యూటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్ రెండూ తిరస్కరించబడ్డాయి. ఆయన హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఇలా ఆరు నెలలుగా జైలులో ఉంటూ బెయిల్ దొరక్క పోవడంతో కాంగ్రెసుతో రాజీకీ రావడమే మంచిదనే ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు.
కేంద్రంతో లాలూచీ పడితే బెయిల్ వస్తుందని, బయటకు వస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని క్యాడర్ కూడా భావిస్తోంది. అందుకే ఆ పార్టీ యూపిఏకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో స్పీకర్ ఎన్నికల సమయంలో జగన్ వర్గంగా ముద్రపడిన ఎమ్మెల్యేలు నాదెండ్ల మనోహర్కు వోటు వేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ జైలు నుండి ప్రత్యేకంగా అనుమతి కోరి ఓటు వేశారు.
తాజాగా ఎఫ్డిఐలపై ఆ పార్టీ ఏమీ మాట్లాడటం లేదు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరి జగన్ ఈ రోజు ఓటింగ్ కోసం ప్రత్యేకంగా కోర్టును అనుమతి కోరినట్లుగా కనిపించడం లేదు. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జగన్ వర్గం ఎంపి సబ్బం హరిలు కూడా స్పందించడం లేదు. వారు యూపిఏకు అనుకూలంగా ఓటు వేసి జగన్ను బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
అనుకూలంగా ఓటేస్తే రాష్ట్రంలో వ్యతిరేకత ఏర్పడుతుందనుకున్న పక్షంలో కనీసం ఓటింగుకు దూరంగా ఉండైనా కాంగ్రెసుకు పరోక్షంగా మద్దతుగా నిలవాలనే యోచనలో ఉన్నారని కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్డిఐలకు వ్యతిరేకంగా ఓటు వేయవద్దనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీకు ఓటేయటం నుండి ఎఫ్డిఐలపై సైలెన్స్గా ఉండటం వరకు చూస్తుంటే జగన్ పార్టీ కాంగ్రెసుతో లాలూచీ పడిందని చెప్పక తప్పదంటున్నారు. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియని ఇలాంటి పరిస్థితుల్లో జగన్ను ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకు రావాలని క్యాడర్ భావిస్తోందని అంటున్నారు.