నారా లోకేషే కాదు, ఎన్టీఆర్ టార్గెట్ కూడా?
తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు నేపథ్యంలో ఇద్దరు యువ నేతలు నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ తమ వ్యూహాలను, ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించుకుని ముందుకు సాగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రి సారథ్యంలో నడుస్తున్న పార్టీలో లోకేష్ తెర వెనక అంతా తానే అయి చక్రం తిప్పుతున్నట్లు అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల్లో పార్టీ గెలిస్తే తన నాయకత్వానికి ఏ విధమైన సవాళ్లు ఎదురు కాబోవని, పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు తన వెంట ఉంటారని లోకేష్ భావిస్తున్నారట.
జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ జయాపజయాలతో సంబంధం పెట్టుకోకూడదని ఆయన అనుకుంటున్నారట. మామ చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ పార్టీని విజయపథంలో నడిపించడానికి 2014 ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డుతారనే విషయం ఆయనకు తెలుసు. ఇందులో తన పాత్ర ఉండకూడదనే ఆయన అనుకుంటున్నారట. అయితే, తాను మాత్రం దూరం కాలేదని మాత్రం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
ఈ ఎన్నికల్లో పార్టీ జయాపజయాలే తనకు మార్గం వేస్తాయని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. తాను తెలుగుదేశం పార్టీని చేతుల్లోకి తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని ఆయన నమ్ముతున్నారట. దీంతో పార్టీలో తన వర్గానికి చెందిన నాయకులను పార్టీలో అట్లా కొనసాగడమో, ఇతర పార్టీల గొడుగు చేరడమో చేయాలని సూచిస్తున్నారట. ఏమైనా, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య వారసత్వ పోరు సుదీర్ఘంగానే సాగేట్లుంది.