ఇందూరు నుంచి కెసిఆర్ తనయ కవిత?
ప్రస్తుతం నిజామాబాద్ లోకసభ స్థానానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణపై ఈ నెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ పరిణామాలు పెద్ద యెత్తున మారుతాయని, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎంపీలు కొంత మంది తెరాసలోకి వస్తారని అంటున్నారు. మధు యాష్కీ కూడా తెరాసలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ స్థితిలో మధు యాష్కీ నల్లగొండ జిల్లా భువనగిరి పార్లమెండటు స్థానానికి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రస్తుత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయవచ్చునని అంటున్నారు. దాంతో రాజగోపాల్ రెడ్డిపై మధు యాష్కీని పోటీకి దించాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారట. ఈ నియోజకవర్గంలో కల్లుగీత కార్మికులు ఎక్కువగా ఉండడం, వారిలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే కావడంతో మధు యాష్కీ బలమైన అభ్యర్థి అవుతారని భావిస్తున్నారు.
గతంలో నల్లగొండ నియోజకవర్గంగా ఉన్నప్పుడు సిపిఐ తరఫున ధర్మభిక్షం కల్లుగీత కార్మికుల మధ్దతుతోనే విజయం సాధించారని అంటున్నారు. అందువల్ల భువనగిరి నియోజకవర్గంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తున్న మధు యాష్కీ గౌడ్ మంచి అభ్యర్థి అవుతారని తెరాస వర్గాలంటున్నాయి.