ప్రచారం తుది స్పీచ్లో ఏడ్చేసిన ఒబామా
వాషింగ్టన్: రోమ్నీపై బరాక్ ఒబామా హోరాహోరీ పోరులో విజయం సాధించారు. అయితే, ఒబామా ప్రచార ఘట్టంలో ఓ మరిచిపోలేని సంఘటన చోటు చేసుకుంది. తన ప్రచారం తుది ప్రసంగంలో ఆయన ఏడ్చేశారు. ఉద్వేగాన్ని ఆపుకోలేక, పాత విషయాలను నెమరేసుకుంటూ సాగిన ప్రసంగంలో ఆయన కంట తడిపెట్టారు. డెస్ మొయినెస్లోని ఈస్ట్ విలేజ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఒబామా 2007లో తన ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇక్కడి నుంచే మార్పు ప్రారంభమైందని, ఈ ప్రారంభానికి ముగింపు ఇవ్వడానికి సహాయం చేయాలని అడగడానికి మళ్లీ ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. ఇది సాధ్యం కాదని కొంత మంది అన్నారని, అయితే సాధ్యమవుతుందని మనం నిరూపించామని అన్నారు.
'ఈ ప్రచారాన్ని మీరు చేపట్టారు. మీ సొంతంగా చేశారు. బ్లాక్ల వారీగా, నైబర్హుడ్ల వారీగా, కౌంటీలవారీగా సంఘటితం చేశారు. అది దేశమంతా వ్యాపించింది' అని అన్నారు. లోవాలో 2008లో పలికిన గొంతు ప్రపంచాన్నే మార్చేసిందని అన్నారు. తాను అధ్యక్షుడిగా తొలి విడత చేసిన పనులను ఆయన వివరించారు.
తన ప్రత్యర్థి రోమ్నీ గురించి ఒబామా చాలా తక్కువగా మాట్లాడారు. దేశాన్ని సరైన మార్గంలో పెట్టడానికి తాను చేపట్టిన చర్యలేమిటో వివరించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గత నాలుగేళ్లలో మనం నిజమైన ప్రగతి సాధించామని, ఇంకా చాలా చేయాల్సి ఉందని అన్నారు. మనమిప్పుడు లోవాలో ఉన్నాం, ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉందని అన్నారు.