జగన్ వైపు తమ్మినేని: ధర్మాన భార్య అడ్డుపుల్ల!
పలువురు నేతలు ఇంకా క్యూలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో తమ్మినేని సీతారామ్ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మొన్నటి వరకు ఎర్రన్నాయుడు హవా కొనసాగింది. దీంతో ఆయన వ్యతిరేక వర్గం అయిన తమ్మినేని తొలి నుండి ఎన్టీఆర్తో ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో నడిచినప్పటికీ... 2008లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.
ఆముదాలవలసలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి టిడిపి గూటికే చేరుకున్నారు. ఇటీవల ఎర్రన్నాయుడు మృతితో సీనియర్లయిన తమ్మినేని, కళా వెంకట్రావులు తమకు జిల్లాలో ప్రాతినిధ్యం పెరుగుతుందనే భావనలో ఉన్నారు. అయితే ఎర్రన్న తనయుడు రామ్మోహన్ నాయుడు అనూహ్యంగా తెరపైకి వచ్చారు. శ్రీకాకుళం లోకసభ అభ్యర్థిగా దాదాపు ఆయన పేరు ఖరారైంది. దీంతో ఇక తమకు ఇక్కడ లాభం లేదనే భావనలో తమ్మినేని ఉండి ఉంటారని అంటున్నారు.
ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మైసూరా రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలతో ఇటీవల మంతనాలు సాగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు సతీమణి, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ మాత్రం తమ్మినేని రాకకు అడ్డుపుల్ల వేస్తున్నారట. ఆయనను పార్టీలోకి రానివ్వకుండా చూడాలని కోరుతున్నారట.
పార్టీ నేతలు ధర్మాన పద్మప్రియకు నచ్చజెప్పిన పక్షంలో ఈ వారంలోనే తమ్మినేని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళతారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళుతున్నట్లుగా వస్తున్న వార్తలను తమ్మినేని ఖండిస్తున్నారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని, తనంటే గిట్టని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన అంటున్నారు.