రాజకీయ పార్టీగా కవిత 'జాగృతి': వెనుక కెసిఆర్?
కాంగ్రెసు పార్టీ పెద్దలతో చర్చించేందుకు కెసిఆర్ పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు పేరుతో ఆయన ఢిల్లీ పెద్దలతో తెలంగాణ అంశంపై చర్చిస్తున్నారు. వాయలార్ రవి తదితర ముఖ్యనేతలతో భేటీ అవుతూ కెసిఆర్ బిజీగా ఉన్నారట. తెలంగాణకు కేంద్రం, కాంగ్రెసు ఓకే చెబితే తెరాసను విలీనం చేసేందుకు సిద్ధమని కెసిఆర్ కాంగ్రెసు పెద్దలతో చెబుతున్నారట. అయితే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మాత్రం కెసిఆర్ వ్యాఖ్యల పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారట.
తెరాస విలీనానికి తాను హండ్రెడ్ పర్సెంట్ సిద్ధమని చెప్పేందుకే కెసిఆర్ ప్రధానంగా ఈ పర్యటనను ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. అందుకే కెసిఆర్ తాను ఢిల్లీ వెళ్లిన తర్వాత తన తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావును, తన కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కూడా ఢిల్లీకి రప్పించుకున్నారట. వారు కూడా విలీనానికి ఓకే అని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లేందుకే ఆయన వారిని ఢిల్లీకి రప్పించుకున్నారట.
విలీనం వ్యాఖ్యలపై కాంగ్రెసు విశ్వసిస్తుందా లేదా అని పక్కన పెడితే కెసిఆర్ మాత్రం పక్కా వ్యూహంతోనే తెరాసను కాంగ్రెసులో కలిపేసేందుకు సిద్దపడ్డారని అంటున్నారు. చిరంజీవి మాదిరిగానే విలీనం తర్వాత కాంగ్రెసులో అడ్జస్ట్ కాలేకపోతే అనే ఆలోచన వచ్చిన కెసిఆర్ అందుకు ప్రత్యామ్నాయం కూడా ఆలోచించి పెట్టుకున్నారట. తెరాస విలీనమైనప్పటికీ భవిష్యత్తులో తన కూతురు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతిని క్రమంగా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందించాలని చూస్తున్నారట.
తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినప్పటికీ దానిలో కెసిఆర్ ఎలాంటి పాత్ర పోషించరు. కానీ దీనిని వెనుక నుండి నడిపిస్తారట. అలా చేయడం ద్వారా కాంగ్రెసులో కలిసినప్పటికీ తన ప్రాధాన్యతను, ప్రాభవాన్ని కోల్పోకుండా ఉండవచ్చునని కెసిఆర్ భావిస్తున్నారట. అయితే నిన్నటి వరకు తెలంగాణపై దృష్టి సారించిన కొందరు కాంగ్రెసు పెద్దలు మమతా బెనర్జీ గుడ్ బై చెప్పడంతో ఇప్పుడు యుపిఏకి ఉన్న మెజార్టీ లెక్కలపై మల్లగుల్లాలు పడుతున్నారట. ప్రస్తుతానికి మళ్లీ వారు తెలంగాణను వదిలేశారంటున్నారు.