జగన్ పార్టీ: షర్మిల, భారతి మధ్య రాజకీయ పోరు?

జగన్ అరెస్టు, వైయస్ పైన అభిమానం, సానుభూతి తదితర అంశాలతో పాటు వైయస్ విజయమ్మ, షర్మిలల ప్రచారం గెలుపుకు బాగా తోడ్పడిందన్న విషయం తెలిసిందే. ప్రచారంలో విజయమ్మ కంటే షర్మిలనే ఎక్కువగా ఆకట్టుకున్నారు. జగన్ అరెస్టు నేపథ్యంలో షర్మిల ప్రజల్లోకి వెళ్లారు. తన అన్న కోసం ఓటు వేయాలని ప్రాధేయపడ్డారు. షర్మిల అనుకరణ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వలె ఉండటంతో ఒక్కసారిగా ఆమెకు పార్టీలో, బయట ఎనలేని గుర్తింపు వచ్చింది.
రాష్ట్ర మీడియాలో ఆమెనే ప్రధానంగా కనిపించారు. గెలుపు క్రెడిట్ను షర్మిల కూడా సొంతం చేసుకుంది. ప్రచారం సమయంలో కాంగ్రెసు పార్టీ నేతలు కూడా షర్మిల పేరు ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఆమె వ్యాఖ్యలను ఖంచించారు. దీంతో ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది. అంతేకాదు వచ్చే సాధారణ ఎన్నికలలో పులివెందుల నుండి పోటీ చేస్తానని కూడా చెప్పారట. అయితే ప్రచారంలో జోరుగా పాల్గొని, జగన్ అరెస్టు నుండి ఫలితాలు వచ్చే వరకు నిత్యం తల్లి వెన్నంటి ఉన్న షర్మిల ఆ తర్వాత మాత్రం కనిపించడం లేదు.
పరకాల నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి కొండా సురేఖను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు షర్మిల కనిపించలేదు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కూడా ఆమె హాజరు కాలేదు. ఇది అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. షర్మిల ఆ తర్వాత కనిపించక పోవడం వెనుక జగన్ సతీమణి వైయస్ భారతి అసంతృప్తియే కారణమట.
షర్మిలకు వచ్చిన ఈ గుర్తింపు భారతిలో ఆవేదన రగిలించిందట. జగన్ భార్యనైన తాను సాక్షి, భారతి సిమెంట్స్ను చూస్తున్నప్పటికీ తనకు అంతగా గుర్తింపు రాలేదని ఆమెలో ఆవేదన కలిగిందట. తన చెల్లికి వస్తున్న ఆధరణ జగన్కు కూడా నచ్చలేదట. దీంతో వ్యూహాత్మకంగా షర్మిలకు కౌంటర్గా భారతి జాతీయ మీడియాలో నానుతున్నారట. ఇటీవల భారతి జాతీయ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయాలపై మాట్లాడారు.
ఇది గమనించిన షర్మిల గప్చుప్గా ఉండిపోయారట. అందుకే ఆమె బయటకు రావడం లేదని అంటున్నారు. అయితే ఇదంతా జగన్ వ్యతిరేక మీడియా సృష్టిస్తోందని, వైయస్ కుటుంబంలో ఒకరి పట్ల మరొకరికి ఎలాంటి అసంతృప్తులు లేవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది.












Click it and Unblock the Notifications