చంద్రబాబు కోటలో వైయస్సార్ విగ్రహాలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గ్రామగ్రామాన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ప్రతిష్టించేందుకు చంద్రగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. 150 గ్రామాల్లో 150 వైఎస్ విగ్రహాలు ప్రతిష్టించేందుకు భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు భాస్కర్ రెడ్డి బుధవారం వైయస్ విగ్రహాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకుని వచ్చి, పార్టీ ముఖ్య నాయకులందరికీ చూపించారు.
చంద్రగిరి నియోజకవర్గం నుంచి గతంలో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, ఆ నియోజకవర్గం ప్రస్తుత మంత్రి గల్లా అరుణ కుమారి పాగా వేశారు. సినీ నటి రోజా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన ప్రాతనిధ్యం లేదని, దీనికి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ను ఇంచార్జీగా నియమించాలని తెలుగుదేశం స్థానిక నాయకులు చెబుతూ వస్తున్నారు.
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆ నియోజకవర్గంపై కన్నేసినట్లు కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ఉనికి గానీ, గల్లా అరుణ కుమార్ ప్రాబల్యం గానీ పనిచేయకుండా వైయస్సార్ విగ్రహాలతో నియోజకవర్గాన్ని ముంచెత్తాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.