నాడు వైఎస్కు అలా: బాబును పట్టించుకోలేదట!

చంద్రబాబు తిరుమల వచ్చిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరు అందర్నీ విస్మయపరిచింది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనానికి చంద్రబాబు వైకుంఠం క్యూకాంప్లెక్సు వరకు కారులో బయలుదేరారు. అయితే, ఎటిసి గేటు వద్ద కారును నిలిపివేశారు. నడవడానికి ఇబ్బందిగా ఉన్న కారణంగా కారును వైకుంఠం క్యూకాంప్లెక్స్ ముఖద్వారం వద్దకు అనుమతించాలని కోరినా అంగీకరించలేదు.
దీంతో బాబు కొంత అసహనానికి గురయ్యారు. కారు దిగి నెమ్మదిగా కాలు నొప్పితోనే నడుచుకుంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయానికి చేరుకున్నారు. చంద్రబాబుతో కలిసి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యేలను, భద్రతా సిబ్బందిని రెండుగా విడగొట్టారు.చంద్రబాబుతో పాటు కొందరిని మాత్రం ప్రాధాన్యతా జాబితా 1లో దర్శనానికి అనుమతించి, మిగిలిన వారిని జాబితా 2లో పంపారు. దీంతో ఎవరికి వారు విడిగా దర్శనం చేసుకున్నారు.
బాబు దర్సనానికి వెళ్లినప్పుడు ఆలయ డిప్యూటీ ఈవో రమణ, ప్రధాన భద్రతాధికారి మాత్రమే ఉన్నారట. మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గతంలో దర్శనానికి వచ్చినప్పుడు జెఈవో స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రసాదం అందజేసేవారు. రంగనాయకుల మండపంలో బాబు కుటుంబానికి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు ఇప్పించే కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో, సివిఎస్ఓ మాత్రమే ఉన్నారు.
బాబు ఆలయం నుంచి బయటకు వచ్చిన కాసేపటికే ఈవో సుబ్రహ్మణ్యం ఆలయంలోకి రావడం విశేషం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ముగించుకొని కాలినడకన తిరుమలకు వచ్చినప్పుడు అప్పట్లో ఈవోగా ఉన్న అజయ్ వైయస్కు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయించడాన్ని గుర్తు తెచ్చుకొని ప్రస్తుత టిడిపి నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారట.












Click it and Unblock the Notifications