జగన్ని దాటాలి: వెతుకులాట ప్రారంభించిన కెసిఆర్!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు నుండి బయటకు వచ్చి కడప నుండి తిరిగి పోటీ చేసి ఐదు లక్షలకు పైగా ఆధిక్యంతో గెలిచారు. పార్టీ నుండి బయటకు వచ్చి ఒంటరిగా జగన్ అద్భుతమైన మెజార్టీ సాధించాడు. సెంటిమెంట్ కలిసి వచ్చిందని ఇతర పక్షాలు చెబుతున్నప్పటికీ అది ఓ రికార్డ్! ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు నుండి రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందాడు.
2009కి ముందు తెరాస ప్రజాప్రతినిధులు పలుమార్లు రాజీనామాలు సమర్పించి తిరిగి పోటీ చేసి అద్భుతమైన విజయం సాధించారు. గతంలో కెసిఆర్ కరీంనగర్ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కెసిఆర్ కరీంనగర్ నుండి మహబూబ్ నగర్ నియోజకవర్గానికి మారారు. అయితే, ఇక్కడ అతను అనుకున్న ఆధిక్యం సాధించలేదు. అంతేకాకుండా ఇటీవల పాలమూరు శాసనసభ నియోజకవర్గంలో బిజెపి గెలుపొందింది.
తెలంగాణవాదంతో గత ఉప ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో గెలిచిన కెసిఆర్ తదుపరి తాను ఎక్కడి నుండి పోటీ చేసినా మెజార్టీ భారీగా ఉండాలని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం అయితే అందుకు అనువుగా ఉండదని ఆయన భావిస్తున్నారట. అందుకోసం నల్గొండకు వెళ్లాలని భావించారట. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన అక్కడ వెనక్కి తగ్గారట.
ఇప్పుడు తన సొంత జిల్లాపై ఆయన కన్ను పడిందని అంటున్నారు. పాలమూరు, నల్గొండ జిల్లాలు కాకుండా మెదక్ జిల్లాకు వెళితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. అదే సమయంలో తనకు నిత్యం సమస్య అయి కూర్చున్న సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డిని కూడా దెబ్బ తీయవచ్చుననే భావనతో ఉన్నారట. మెదక్ నుండి పోటీ చేస్తే భారీ మెజార్టీ ఖాయమనే భావనంలో గులాబీ క్యాడర్ కూడా ఉందట. అదే జరిగితే విజయశాంతి నల్గొండ జిల్లాకు రావచ్చునని అంటున్నారు. భువనగిరిపై ఇప్పటికే ఆమె ఆసక్తి కనబరుస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈసారి కెసిఆర్ పోటీ చేసే నియోజకవర్గంలో జగన్ ఆధిక్యాన్ని మించేలా ఉండాలని కార్యకర్తలు ఉత్సాహపడుతున్నారు.