ఆయత చండీయాగానికి కెసిఆర్ ఏర్పాట్లు
హైదరాబాద్: చండీయాగంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు గురి కుదిరినట్లుంది. తాజాగా ఆయన మరోసారి చండీయాగం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడుసార్లు ఆయన చండీయాగాలు చేశారు.
ఈసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 'అయత చండీ యాగం' తలపెట్టినట్లు సమాచారం. లోక కల్యాణార్థం, సంకల్ప సిద్ధి కోసం, లక్ష్య సిద్ధి కోసం ఈ బృహత్ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మెదక్ జిల్లాలోని తన ఫామ్హౌస్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో 12 రోజులపాటు ఈ యాగం నిర్వహించాలని ఆలోచిస్తున్నారట.
ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడా జరగని ఈ యాగ నిర్వహణకు ఐదారు కోట్ల వ్యయం అవుతుందని అంచనా అంటూ వార్తలు వచ్చాయి. ఒక్క అయత చండీయాగం పది సహస్ర చండీ యాగాలతో సమానమని వేద పండితులు అంటారు. ఈ యాగ నిర్వహణలో సుమారు రెండువేల మందికిపైగా వేదపండితులు భాగస్వాములవుతారని తెలిసింది.
తెలంగాణపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడానికి దైవబలం కూడా సహకరించిందని, లోక కళ్యాణంతోపాటు 'తెలంగాణ రాష్ట్రం' బాగుండాలనే లక్ష్యంతో అయత చండీయాగం నిర్వహించేందుకు కెసిఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.