ఫైట్ బ్యాక్: ధోనీలాగా కిరణ్ రెడ్డి బ్యాటింగ్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ అనే విషయం తెలిసిందే. కాలేజీ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి జట్టులోనే మొహ్మద్ అజరుద్దీన్ క్రికెట్ ఆడాడు. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిని క్రికెట్ క్రీడతో పోల్చడం పరిపాటిగా మారింది. తెలంగాణపై జరిగిన కోర్ కమిటీ సమావేశంలో వ్యవహరించిన తీరుకు ఆయనను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలుస్తున్నారు.
సెల్కాన్ మొబైల్ కప్ ముక్కోణపు వన్డే ఫైనల్ మ్యాచులో చివరి ఓవరులో 15 పరుగులు కావాల్సి ఉండగా, ఆ పరుగులను బాదేసి శ్రీలంకపై విజయాన్ని అందించిన ధోనీ లాగానే కోర్ కమిటీ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రజంటేషన్ ద్వారా కాంగ్రెసు అధిష్టానం పెద్దలను పడేశారని అంటున్నారు.

రాష్ట్ర విభజన జరిగితే ఎదురయ్యే సమస్యలను ఆయన అంశాలవారీగా అధిష్టానం పెద్దల ముందు పెట్టినట్లు చెబుతున్నారు. ఆయన 12 అంశాలను క్రోడీకరించి, అధిష్టానం పెద్దలకు వివరించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే జల వివాదాలను సోదాహరణంగా ఆయన వివరించారట. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, మజ్లీస్ పార్టీలు పుంజుకుంటాయని, దానివల్ల మతవిద్వేషాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విశ్లేషణతో విభజనపై కోర్ కమిటీ సమావేశం నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా అధిష్టానం పెద్దలను కదిలించడంలో కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారని అంటున్నారు. మొత్తం మీద, కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిదే విజయమని అంటున్నారు.












Click it and Unblock the Notifications