దిగ్విజయ్, షిండేలకు కిరణ్ రెడ్డి చురకలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం రెండు సార్లు శాసనసభకు వస్తుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఓసారి తీర్మానం రూపంలో, మరోసారి బిల్లు రూపంలో వస్తుందని ఆయన చెప్పారు. అయితే, బిల్లు రూపంలో అసెంబ్లీకి ఒకసారి మాత్రమే వస్తుందని సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఈ విషయంపై కిరణ్ కుమార్ రెడ్డి వారిద్దరి తీరుపై ఆక్షేపణ తెలియజేశారు.
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని కూడా కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన ఈ ఎన్నికలలోగా పూర్తి కాదని ఆయన నమ్మకంగా చెప్పారు. సుశీల్ కుమార్ షిండే ప్రకటన సీమాంధ్ర ఉద్యోగులతో జరుపుతున్న చర్చలకు విఘాతం కలిగించవచ్చునని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు.
మొత్తం మీద, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, పార్టీ అధిష్టానం పెద్దలను ఢీకొంటూ సీమాంధ్ర చాంపియన్గా నిలవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాయని, తాను మాత్రం ప్రజల కోసం మాట్లాడుతున్నానని ఆయన చెప్పుకున్నారు.