అన్నీ ట్విస్ట్లే: షర్మిలకు టిడిపి నేత స్థలం(పిక్చర్స్)
కృష్ణా జిల్లా విజయవాడ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల చుట్టూ రాజకీయాలు ఆసక్తికరంగా తిరుగుతున్నాయి. తాజాగా ఓ టిడిపి నేత మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సభ కోసం స్థలం ఇచ్చారట. జిల్లాకు చెందిన టిడిపి నేత చిగురుపాటి టిడిపి తరఫున గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. మరోసారి ఓడిపోయారు.
అయితే, ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర సభ కోసం స్థలం ఇచ్చారు. అక్కడి సభలో చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడు అదే నేత తన స్థలాన్ని షర్మిల సభకు కేటాయించారు. షర్మిల పాదయాత్ర కోసం చిగురుపాటి స్థలం ఇవ్వడంపై స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. రాజకీయాల్లో తమకు బద్ద వ్యతిరేకిగా ఉన్న జగన్ పార్టీకి స్థలం ఇవ్వడం తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదు.
అయితే, గతంలో జరిగిన ఎన్నికల్లో చిగురుపాటి ఓడిపోవడానికి కారణం స్వంత పార్టీ కార్యకర్తలేనని ఆయన భావిస్తున్నారట. ఈ కారణంతో ఆయన పార్టీ మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అందులో భాగంగానే ఇతను తన స్థలాన్ని షర్మిల సభకు ఇచ్చారంటున్నారు. త్వరలో ఆయన టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెసు గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఆయనను టిడిపి బుజ్జగిస్తుందా లేక ఆయన పార్టీని వీడుతారా అనేది ఇప్పుడు జిల్లాలో సస్పెన్స్గా మారింది.
ఇప్పటికే విజయవాడలో ఫ్లెక్సీల రాజకీయ వేడి రాజుకున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఫ్లెక్సీలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టిన విషయం టిడిపిలో చిచ్చు రేపింది. జూనియర్తో పాటు కొడాలి నాని, జగన్ ఫోటోలు పెట్టారు. మరోచోట రెండోసారి ఎన్టీఆర్, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణల ఫోటోలు పెట్టారు. వంగవీటి రాధాకృష్ణ, కాంగ్రెసు సీనియర్ నేత దేవినేని నెహ్రూల మధ్య కూడా ఫ్లెక్సీ వార్ జరిగింది.
గతంలో చంద్రబాబు పాదయాత్రకు కేటాయించిన స్థాలాన్ని ఇప్పుడు టిడిపి నేత షర్మిల యాత్రకు కేటాయించడం వివాదాస్పదమైంది.
బెజవాడలో ఇటీవల ఫ్లెక్సీ వార్ నడుస్తోంది
వంగవీటి రాధా, దేవినేని నెహ్రూల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. పోలీసులు దానిని ప్లాస్టర్లతో అంటించడంతో వివాదం సమసిపోయింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కూడా చిచ్చు రేపాయి.