కిరణ్ రెడ్డికి వైరాగ్యం: తలరాత వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ బాంబు పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను వైరాగ్యం ఆవరించినట్లు కనిపిస్తోంది. మీడియా ప్రతినిధులు గురువారం వేసిన ప్రశ్నలకు వారు చెప్పిన సమాధానాలు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.
తలరాతను ఎవరూ తప్పించలేరని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దిల్సుఖ్నగర్ దుర్ఘటనపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి మీడియాతో మాట్లాడిన తర్వాత తన కార్యాలయానికి వెళ్తున్న సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు ఆయన భద్రత విషయంలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తలరాతను ఎవరూ తప్పించలేరని వ్యాఖ్యానించారు.
సంఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు వెంటనే ఘటనా స్థలికి వెళ్లారని, ఇది అభినందనీయమే అయినా భద్రతా కారణాల రీత్యా అలా హుటాహుటిన వెళ్లడం సరైనదేనా అని మీడియా ప్రతినిధులు అన్నారు. తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందంటూ ముఖ్యమంత్రి సంజ్ఞ చేశారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ తమ ప్రాణాలకు ముప్పుందని భయపడితే ప్రజలకు భరోసా ఎవరిస్తారని ప్రశ్నించారు. పైగా హుటాహుటిన వెళ్లకపోవడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించారు.












Click it and Unblock the Notifications