జైల్లో ఉన్న జగన్ను కలిస్తే మ్యాటర్ ఫినిష్!
వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని పలువురు నేతల భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ టిక్కెట్ కోసం నేతలు క్యూ కడుతున్నారు. జగన్ జైలులో ఉండటంతో పార్టీ నేతలు ఇచ్చే హామీలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపించడం లేదట. జైలులో ఉన్నప్పటికీ జగన్ను కలిసిన తర్వాత టిక్కెట్ పైన ఆయన నుండి హామీ వస్తేనే చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారట.
ఇప్పటికే పలు నియోజకవర్గాలకు టిక్కెట్లు ఎవరికివ్వాలనే నిర్ణయానికి జగన్ వచ్చేశారట. మరికొన్ని నియోజకవర్గాలలో పట్టున్న నేతలను పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ పార్టీలోకి వెళ్లే నేతలు జగన్ను కలిసి ఆయన నుండి తాము ఆశించే నియోజకవర్గం టిక్కెట్ పైన హామీ వచ్చాక వారు సంతృప్తిగా పార్టీలో చేరుతున్నారట. టిక్కెట్ ఆశించే నేతలు జగన్తో భేటీనే కోరుకుంటున్నారట.
దీంతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ములాకత్ సమయంలో జగన్ను కలవాల్సిన లిస్టులో వారి పేరు కూడా ఉంచుతున్నారట. జైలు నిబంధనల ప్రకారం వారానికి ఎనిమిది మందిని కలిసేందుకు అనుమతిస్తారు. ములాకత్ సమయంలో కలిసే వారి పేర్లను పార్టీ జైలు అధికారులకు పంపుతుంది. ఆ తర్వాత వాటిని జగన్ చూసి ఓకే అనుకున్న వారికి అనుమతిస్తున్నారట. వద్దనుకుంటే వారికి అనుమతించడం లేదట. కలవాలని భావించే ప్రతి నేతను జగన్ కూడా కలవాలనుకోవడం లేదట.
ఇటీవల ఓ జిల్లాకు చెందిన శాసన సభ్యుడు జగన్ను కలవాలనుకున్నారట. ఆయన నియోజకవర్గంలో అప్పటికే వేరే వారికి టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారట జగన్. పార్టీలోకి రావాలనుకుంటే ఇప్పుడున్న నియోజకవర్గ టిక్కెట్ ఇవ్వలేమని, వేరే నియోజకవర్గం అయితే ఇస్తామని చెప్పారట. దీంతో అతను వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. జగన్ను కలవడానికి ముందు టిక్కెట్ పైన పూర్తిగా సందేహాలు తీర్చుకొని ఆ తర్వాత జగన్ నుండి పూర్తి హామీ కోసం నేతలు జైలుకు క్యూ కడుతున్నారంటున్నారు.