సర్పంచ్ ఎన్నికల్లో పూరీ జగన్నాథ్ తల్లి పోటీ

ప్రముఖ సీనీదర్శకుడు పూరి జగన్నాథ్ తల్లి పెట్ల సత్యవతి విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం బికె పల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. తన రెండవ కుమారుడు, నర్సీపట్నం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్తో కలిసి వచ్చిన ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
అమెకు వరుసకు కోడలు అయిన పెట్ల చిట్టి అనంతలక్ష్మి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా, కాంగ్రెస్ అభ్యర్థి చిట్టి అనంతలక్ష్మికి మద్దతు ఇస్తోంది. అత్తాకోడళ్ల మధ్య జరిగే ముఖాముఖి పోటీ ఆసక్తికరంగా మారనుంది.
బికె పల్లి పంచాయతీకి సత్యవతి బావ, చిట్టి అనంతలక్ష్మి మామ అయిన పెట్ల బెన్నయ్యనాయుడు 1984 వరకు 30 సంవత్సరాల పాటు సర్పంచ్గా పని చేశారు. చిట్టి అనంతలక్ష్మి మరిది పెట్ల రాంబాబు ఐదు సంవత్సరాలు పనిచేశారు.
అదే విధంగా సత్యవతి రెండో కుమారుడు గణేష్ ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పని చేశారు. దగ్గరి బంధువులైన సత్యవతి, అనంతలక్ష్మి పోటీ అసక్తికరంగా మారనుంది. అత్తాకోడళ్ల పోటీలో గెలుపు ఎవరిదో తెలియాలంటే ఈనెల 27 వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications