కొండా సురేఖ అనుభవంతో రోజా దిగొచ్చారా?
కొండా దంపతుల పరిస్థితి తనకు రాకూడదనే ఉద్దేశంతో రోజా ముందుగా జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ సోదరి షర్మిలను రోజా ప్రశంసలతో ముంచెత్తారు. మండు వేసవిలో రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయడం నిజంగానే ఓ ప్రపంచ రికార్డు అంటూ ఆమె ఆకాశానికెత్తారు.
షర్మిల చేపట్టిన పాదయాత్ర గురువారానికి రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నటి రోజా మాట్లాడారు. ఒక మహిళ మండుటెండలో పాదయాత్ర చేయడం ప్రపంచ చరిత్రలో మొదటిసారని ఆమె అన్నారు.
షర్మిల పాదయాత్ర దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. షర్మిలను దివంగత మహానేత వైఎస్ఆర్ ఆశీస్సులు, వైఎస్ జగన్ ఆశయాలే ముందుకు నడిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. షర్మిల పాదయాత్రను చూసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు జెట్ స్పీడ్ వేగంతో పరుగెడుతున్నాయని ఆమె అన్నారు. ఏమైనా, రోజా దిగివచ్చినందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు కూడా ఆనందంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.