మర్యాద మరిచిన తెలుగు సినీ హీరోలు?
అలనాటి సుప్రసిద్ధ నటుడు కైకాల సత్యనారాయణ, నిర్మాత డి.రామానాయుడు సహా పలువురు ప్రముఖులు, హీరోలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నిటికీ మించి ఈసారి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన సుప్రసిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్ పురస్కారాల ప్రదానానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి డీకే అరుణ, ఇతర ప్రముఖులూ వచ్చారు.
అయితే, పురస్కారాలు అందుకున్న హీరోలు అలా నంది అవార్డు తీసుకోవటం, ఇలా వేదిక దిగి వెళ్ళిపోవటమూ వరుసగా జరిగిపోయాయి. చివరకు వేదికపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో పాటు అతిథిగా వచ్చిన అమితాబ్ మాత్రమే చివరి దాకా ఉన్నారు తప్ప తెలుగువారంటూ ఎవరూ లేకుండా పోయారు. అమితాబ్ను సాగనంపేందుకు కారుదాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రికి తెలుగు హీరోలు ఒక్కరూ కనిపించకపోవటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఆ విషయంపై మంత్రి డికె అరుణను ముఖ్యమంత్రి వాకబు చేసినట్టు తెలిసింది. వచ్చిన హీరోలలో నాగార్జున మాత్రం ముందే చెప్పి వెళ్ళిపోగా, ఆయన వెళ్ళిన పది నిముషాలకే మహేష్బాబు కూడా వెళ్ళిపోయారు. ఇలా ఒక్కొక్కరూ ఇలా పురస్కారం అందు కోవటం, అలా వెళ్ళిపోవటంతో ముఖ్యమంత్రి తన సందేశం ఇవ్వకుండానే కోపంగా వెళ్ళిపోయారు. మొత్తం మీద, ఈ కార్యక్రమం ముఖ్యమంత్రికి తీవ్ర నిరాశను మిగిలించిందని చెబుతున్నారు.