వచ్చేది చివరి పోపా: క్రైస్తవానికి కష్టమా?
ఆయన చెప్పిందే జరిగిందని, ఆయన లెక్క ప్రకారం 112వ పోప్ తర్వాత క్రైస్తవానికి పతన దశ మొదలవుతుందట. వీర బ్రహ్మేంద్ర స్వామి, మయన్లు, నోస్ట్రడోమస్ చెప్పినవి జరుగుతున్నాయని పలువురు భావిస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే సెయింట్ మలాచీ. ఆయన 1094లో ఐర్లాండ్లో జన్మించారు.
1148లో మరణించాడు. 1139లో వాటికన్ను సందర్శించారు. ఆ సమయంలోనే అలౌకికావస్థలో భవిష్యవాణి వినిపించారు. దీన్ని ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. అందులోని వివరాలు బయటకు రాకుండా చర్చి అధికారులు అనేక ప్రయత్నాలు చేశారట. 1590లో బెనెడిక్ట్ అర్నాల్డ్ డివైన్ అనే మతగురువు మలాచీ భవిష్యవాణిని గ్రంథరూపంలోకి తెచ్చారట.
దానిని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోయినప్పటికి, జాబితాలో 111వ పోప్ అవధి కూడా పూర్తి కావడం, 112వ పోప్ ఎవరనే ప్రశ్న తలెత్తడంతో మలాచీ భవిష్యవాణిపై క్రైస్తవ ప్రపంచంలో పెద్ద చర్చ జరుగుతోందట. మలాచీ భవిష్యవాణితో చర్చి ఎప్పుడూ ఏకీభవించలేదట. కానీ, ఆయన ఇప్పటిదాకా పేర్కొన్న పోప్ల పేర్లు తప్పుకాలేదట!
అయితే, ఆయన పోప్ పేర్లను ప్రస్తావించకుండా వారికి ఏదో ఒక సంబంధం వచ్చేలా ఆయన లిస్టులో ఉందట. వారి అసలు పేర్లు కాకుండాల ఇతర సంకేతాలను ఆయన పేర్కొన్నారట. మలాచీ ప్రకారం ప్రస్తుతం కాబోయే పోప్ ప్రజలను ఒడిదుడుకులను తప్పిస్తారట. అయితే, చివరకు ఏడుకొండలున్న నగరం నాశనమవుతుందని చెప్పారట.
వాటికన్ సిటీని ఏడుకొండల నగరం అని పిలుస్తారు. దీంతో కాబోయే పోప్ ఎవరనే ఆసక్తి పలువురు క్రైస్తవులలో నెలకొంది. మలాచీ జాబితోలో 112వ పోప్ పేరు పీటర్. అయితే, మలాచీ ఎక్కడా పేర్లను ప్రస్తావించలేదు. పీటర్ అంటే 'కఠిన శిల' అనే అర్థంకూడా ఉంది.
ప్రస్తుతం ఈ పదవికి పోటీపడుతున్న వారిలో ఘనాకు చెందిన కార్డినల్ పీటర్ టర్క్సన్ కూడా ఉన్నారు. ఒకవేళ పీటర్ టర్క్సన్ పోప్ అయితే ఆయనకు 65 ఏళ్లు. మరో 20 ఏళ్లు చురుగ్గా ఉండగలుగుతారు. అంటే 2033నాటికి ఏదో పెద్ద విపత్తు ముంచు కొస్తుందనేది మలాచీని విశ్వసించే వారి ఆందోళనగా ఉందట. అయితే, ప్రపంచమంతటా విస్తరించిన క్రైస్తవానికి వచ్చే ప్రమాదమేమీ లేదని కొట్టి పారేసేవారు లేకపోలేదు.