కావూరిలో మార్పు: 'టీ'పై లగడపాటి ఏం చెప్తారో?
కేంద్రంలో మంత్రి పదవి రాగానే సమైక్య గళానికి నాయకత్వం వహిస్తూ వచ్చిన కావూరి సాంబశివ రావు రాజీ మార్గానికి వచ్చారు. లగడపాటి రాజగోపాల్ కూడా అదే విధమైన రాజీ మార్గానికి ఏమైనా వచ్చారా అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో తాను గొంతు విప్పుతానని ఆ అనుమానాలకు తెర దించారు.
ప్రతి సందర్భంలోనూ లగడపాటి రాజగోపాల్ తారీఖులు, దస్తావేజులతో ముందుకు వచ్చి మీడియా సమావేశాలు పెడుతూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని ఆయన గట్టిగా చెబుతూ వచ్చారు. అదే నమ్మకంతో ఆయన ఇప్పుడు కూడా ఉన్నారా, తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం చేస్తున్న కసరత్తును గమనిస్తున్నారా అనేది తెలియదు.
తెలంగాణవాదం తగ్గుముఖం పట్టిందని, తెలంగాణ వివాదం సమసిపోయిందని ఆయన ఆ మధ్య ఓసారి అన్నారు. రేపు మంగళవారం ఆయన తెలంగాణపై ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగానే ఉంది. కావూరి సాంబశివ రావు తన వైఖరి మార్చుకోవడం కారణంగానే లగడపాటి చెప్పే విషయాలపై ఆసక్తి నెలకొని ఉంది.