రేవంత్కు నోటీసు: పోలీసుల 'టీఆర్ఎస్' పొరపాటు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఇచ్చిన నోటీసులలో పోలీసులు పొరపాటున.. రేవంత్ రెడ్డి ఆఫీస్ ఆప్ టీఆర్ఎస్ ట్రస్ట్ భవన్ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనినే రేవంత్కు పోలీసులు అందజేశారు.
పొరపాటుగా ఇది పంపారని పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నార. ఈ అంశంపై వివాదం అయ్యే అవకాశం ఉందనే భావనతో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చిరునామా మార్చి మళ్లీ తాఖీదులు పంపారు. దిల్సుఖ్ నగర్లో ఉంటున్న న్యాయవాది గోవర్ధన్... రేవంత్ పైన నాంపల్లి కోర్టులో ప్రయివేటు ఫిర్యాదు చేశారు.
రెండు నెలల క్రితం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఆరోపణలు చేశారని గోవర్ధన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ మేరకు రేవంత్ పైన కేసు నమోదు చేసి విచారించాలని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1, 2014న బంజారాహిల్స్ పోలీసులు రేవంత్ పైన కేసు నమోదు చేశారు.
దీని పైన సమాధానం రెండు రోజుల్లో ఇవ్వాలని ఎస్సై నోటీసులు పంపారు. ఇందులో రేవంత్ రెడ్డి చిరునామా టీఆర్ఎస్ ట్రస్ట్ భవన్, రోడ్డు నెంబర్ 12, బంజారాహిల్స్గా పేర్కొన్నారు. నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు మరిన్ని రోజులు గడువు కావాలని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లేఖ రాశారని తెలుస్తోంది.