బీహార్ యువతులతో పెళ్లి చేస్తా!: బిజెపి నేత

దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా హర్యానాలో పురుషులతో పోలిస్తే స్త్రీల సంఖ్య చాలా తక్కువ అనే విషయం తెలిసిందే. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు 879 మంది మాత్రమే స్త్రీలున్నారు. ఈ నేపథ్యంలో చాలా గ్రామాల్లో వందల సంఖ్యలో యువకులకు తగిన అమ్మాయిలు దొరక్క పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండిపోతున్నారు. ఇది గమనించిన బిజెపి నేత ఓపి ధన్కర్ ‘రాష్ట్రంలో మీకు తగిన అమ్మాయి దొరక్కపోతే బీహార్నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి పెళ్లిళ్లు చేస్తా' అని హామీ ఇస్తున్నారట.
గత శుక్రవారం జింద్ జిల్లాలోని నర్వానాలో జరిగిన కిసాన్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. హర్యానా యువతకు ఈ హామీ ఇచ్చారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రోహ్టక్నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ధన్కర్.. దీపిందర్ హూడా చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడమంటే తగిన అమ్మాయి దొరక్క ఇబ్బంది పడుతున్న చాలా గ్రామాల్లోని యువకులకు తగిన అమ్మాయి లభించడమేనని కూడా ఆయన భాష్యం చెప్పారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు కొంతమంది యువకులు బీహార్నుంచి, ఇతర ప్రాంతాలనుంచి అమ్మాయిలను కొనుక్కు వచ్చిన కథలు వినడం జరిగిందని ఆయన చెప్పారు. బీహార్లో బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ మోడీ తనకు మంచి మిత్రుడని, తామిద్దరమూ కలిసి రాష్ట్రంలోని యువకులకు తగిన సంబంధాలు లభించేలా చూడడానికి ప్రయత్నం చేస్తామని తాను వాళ్లకు చెప్పినట్లు కూడా ఆయన తెలిపారు.
కాగా, ధన్కర్ చేసిన వ్యాఖ్యలపై సుశీల్ మోడీ స్పందిస్తూ.. చట్టబద్దంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి సాయం చేస్తామని మాత్రమే ఆయన చెప్పి ఉండొచ్చని అన్నారు. మహిళలకు గౌరవం కల్పించడం గురించే ఆయన మాట్లాడి ఉంటాడని తాను అనుకుంటున్నానని, పెద్ద సంఖ్యలో అమ్మాయిలు హర్యానాకు తరలి వెళ్తున్న విషయంపై బీహార్ ప్రభుత్వం ఆలోచించాలని మోడీ అన్నారు.
ఈ అమ్మాయిలను కొనుక్కుని తీసుకెళ్తున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోందని, రాష్ట్రప్రభుత్వం ఈ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. కాగా, ధన్కర్ ప్రతిపాదన అర్థం లేనిదని జెడి(యు) నాయకుడు శరద్ యాదవ్ పేర్కొన్నారు. హర్యానా, బీహార్కు చెందిన చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారని, ఇవన్నీ కూడా పరస్పర అంగీకారంతో జరిగినవేనని తెలిపారు.












Click it and Unblock the Notifications