బాబు పట్టు: రెంటికి చెడిన రేవడి పురంధేశ్వరి?
హైదరాబాద్: విశాఖపట్నం లోకసభ స్థానం టికెట్ను హామీ పొంది బిజెపిలో చేరిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా మారుతుందా అనే సందేహం కలుగుతోంది. విశాఖపట్నం నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. పట్టుబట్టి తెలుగుదేశం నుంచి విశాఖ సీటు నుంచి బిజెపి తీసుకుంది. అయితే, అక్కడి నుంచి పురంధేశ్వరిని పోటీకి దించే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వైయస్ విజయమ్మ విశాఖ లోకసభ సీటుకు పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. స్థితిలో హరిబాబును విశాఖ నుంచి పోటీకి దించాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో పురంధేశ్వరికి సీటు లభించే అవకాశాలు తగ్గాయి. పైగా, పురంధేశ్వరికి సీటు ఇస్తే తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.
పురంధేశ్వరి కోసం ఒంగోలు లేదా విజయవాడ లోకసభ స్థానం ఇవ్వాలని బిజెపి నేతలు చంద్రబాబును అడుగుతున్నారు. కానీ అందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి పరిస్థితి ఎటూ కాకుండా పోయే పరిస్థితి ఉందని అంటున్నారు.
బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఈ స్థితిలో పురంధేశ్వరి లోకసభకు ఎన్నికైతే కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది. దానివల్ల కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో లేదా ఎన్డియె వ్యవహారాల్లో పురంధేశ్వరి పాత్ర పెరిగి, తన పాత్ర తగ్గుతుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. దానివల్లనే పురంధేశ్వరి అభ్యర్థిత్వాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.