పవన్ కళ్యాణ్ చెప్తే బిజెపిలోకి: మళ్లీ కాంగ్రెసులోకి..?
మెదక్: తూర్పు జయప్రకాష్ రెడ్డి అంటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు గానీ జగ్గారెడ్డి అంటే అందరూ ఇలాగే కనిపెట్టేస్తారు. పెద్ద తలవెంట్రుకలు, గడ్డం ఆయన ట్రేడ్ మార్క్.. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు బద్ధ శత్రువు. మాటల ఈటెలు విసరడంలో అందె వేసిన చేయి. ఆయన మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ శానససభ్యుడు జగ్గారెడ్డి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెసు వైపు చూస్తున్నారట.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతుతో ఆయన బిజెపిలో చేరి, మెదక్ లోకసభకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. టిఆర్ఎస్ అభ్యర్థిని కొత్త ప్రభాకర్ రెడ్డిని మట్టి కరిపించే ఏకైక లక్ష్యంతో ఆయన బరిలోకి దిగారు. అయితే, ఆయన లక్ష్య సాధనలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బిజెపిలో క్రియాశీలక పాత్ర పోషించడం లేదు. మెదక్ లోకసభ ఉప ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత ఆయనలో నిర్వేదం ఏదో ఆవహించినట్లు చెబుతున్నారు.
అయితే, రాజకీయ జీవితాన్ని మాత్రం కొనసాగించాలని ఆయన అనుకుంటున్నారట. దాంతో తిరిగి కాంగ్రెసు గూటికి చేరుతారని పుకార్లు షికార్లు చేస్తున్ాయి. ఆయన గతంలో సంగారెడ్డి శానససభ సీటు నుంచి కాంగ్రెసు తరఫున ప్రాతినిధ్యం వహించారు. మొదట్లో బిజెపిలో ఉండేవారు. ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ, ఎక్కడ బెడిసి కొట్టిందో తెలియదు గానీ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెసులోకి వచ్చి పడ్డారు.
కాంగ్రెసులో చేరిన తర్వాత కెసిఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావులను దుయ్యబట్టడమే పనిగా పెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో టిఆర్ఎస్ను తుడిచిపెట్టి, కెసిఆర్ను ఆటాడించాలని అనుకున్నారు. కానీ, అది అంత సులభం కాదని అనుభవం ద్వారా తెలుసుకున్నారు. అప్పట్లో తెలంగాణలో తనకు నచ్చిన నాయకుడు జగ్గారెడ్డి ఒక్కరే అని పవన్ కళ్యాణ్ కితాబు కూడా ఇచ్చారు.