బిజెపి ఆఫీస్లో లేడీస్ టాయిలెట్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యాలయంలో మరుగుదొడ్డి లేదని, తన ఎమ్మెల్యే నిధులతో అక్కడ మరుగుదొడ్డిని కట్టిస్తానంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఢిల్లీ శాఖ కార్యాలయంలో మహిళలకు మరుగుదొడ్లు అందుబాటులో లేవని, తన ఎమ్మెల్యే నిధులతో ఆ కొరతను తీరుస్తానని ప్రస్తావిస్తూ ఢిల్లీ మునిసిపల్ కమిషనర్ కు ఆయన లేఖ రాశారు.
పండిట్ పంత్ మార్గ్లోని బీజేపీ ఢిల్లీ శాఖ కార్యాయలం అరవింద్ కేజ్రీవాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ పరిధిలోకే వస్తుంది. దీంతో అరవింద్ కేజ్రీవాల్, ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ కు లేఖ రాశారు. జాతీయ మీడియాలో ఈ మేరకు వార్తాకథనాలు వచ్చాయి.
‘ఆ భవనం బీజేపీకి సంబంధించినదే అయినా, నా నియోజకవర్గ పరిధిలో ఉంది. రాజకీయాలకు అతీతంగా నా ఎమ్మెల్యే స్థానిక నిధుల నుంచి ఆ కార్యాలయంలో మరుగుడొడ్లను నిర్మిస్తాను' అంటూ ఆయన మంగళవారం ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఓ విమర్శగా కేజ్రీవాల్ ఆ పనిచేసినట్లు భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్ ద్వారా పరిశుభ్రతకు, పారిశుద్ధ్యాన్నికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నారు.