ప్రశ్నించిన మహిళ, ముగ్ధుడై మోహన్బాబు ప్రశంస
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి ఎదురైన అనుభవమే ప్రముఖ హీరో, నిర్మాత మోహన్ బాబుకు బుధవారం ఎదురైంది. మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణు, తల్లి, ఇతరులతో కలిసి తన స్వగ్రామం రంగంపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.
ఈ సమయంలో ఆయనకు ఓ మహిళ క్యూలో రావాలని సూచించారట. మోహన్ బాబు తన తల్లి ఓటును తాను వేయవచ్చా అని అడిగేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే, మోహన్ బాబు క్యూలో వెళ్లడం లేదని భావించిన ఓ మహిళ క్యూలో నిలబడాలని మోహన్ బాబుకు సూచించింది.
మోహన్ బాబు వంటి తారలను ఇలాంటి సమయాల్లో తప్ప చూడటం దాదాపు కుదరదు. అయితే, ఆయనను స్వగ్రామంలోనే ఓ మహిళ క్యూలో రావాలని సూచించారు. తాను క్యూ లైన్లోనే వస్తున్నానని, తన తల్లి ఓటు గురించి అడిగేందుకే వెళ్లానని ఆయన వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో క్యూలైన్లో రాని వారిని కర్రతో కొట్టాలని సూచించారు. తాను క్యూ తప్పనని చెప్పారు.
అయితే, తాను క్యూ తప్పక పోయినప్పటికీ.. తాను నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లడాన్ని గుర్తించి, నిబంధనల ప్రకారం తనను నిలదీసిన మహిళ ధైర్యాన్ని ఆయన ప్రశంసించారట. ఆమె ప్రశ్నించిన తీరు ఆయనను ఆకట్టుకుందట. అందరు ఇలా నిబంధనలు తెలుసుకోవాలని, నిబంధనలు పాటించకుంటే నిలదీయాలని ఆయన సూచించారు.