తెలంగాణ నేతలపై సోనియా గాంధీ గరం
హైదరాబాద్: తెలంగాణ పార్టీ నేతలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చినా ఫలితాలు సాధించలేకపోగా, ఆ తర్వాత వ్యవహారాలు కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా లేవనే ఆగ్రహంతో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాలు, పనితీరు దిగదుడుపుగా ఉందని ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
సోమవారం జరిగిన తెలంగాణ కాంగ్రెసు శాసనసభా పక్షం (టిసిఎల్పీ) సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఇటీవల సోనియా గాంధీ కుంతియాను పిలిచి, తెలంగాణలో పార్టీ వ్యవహారాల గురించి చర్చించినట్లు సమాచారం.
కుంతియాతో సోనియా గాంధీ 40 నిమిషాల పాటు తెలంగాణలో కాంగ్రెసు వ్యవహారాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెసు పనితీరు ఏ మాత్రం బాగా లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
కొంత మంది పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయాన్ని సోనియా ప్రస్తావిస్తూ మీరూ, దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని అడిగారట. పూర్తిగా తాను అసంతృప్తితో ఉన్నట్లు ఆమె చెప్పారు.
సోనియా ఆగ్రహం గురించి కుంతియా సోమవారం సిఎల్పీ సమావేశంలో వివరించి, సీరియస్గా పనిచేయకపోతే సమస్యలు తప్పవని హెచ్చరించినట్లు చెబుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, డి శ్రీనివాస్ వంటివాళ్లు నిత్యం చర్చించుకుని పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు.