సోనియా సంతకం చేసి వెంట తీసికెళ్లారు
న్యూఢిల్లీ: కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినప్పుడు తీవ్రమైన భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి. తనను దేవతను చేయవద్దని సూచించిన సోనియా గాంధీకి 'తెలంగాణ అమ్మ' అని రాసి ఉన్న వేంకటేశ్వర స్వామి, షిర్డీ సాయిబాబాల ఫొటో ఫ్రేమ్ను ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సమర్పించారు.
'గుడ్ విషెస్ టూ తెలంగాణ అండ్ సీమాంధ్ర' అని రాసి ఉన్న ఆ ఫొటోపై ఆయన సోనియా సంతకాన్ని కోరారు. సంతకం చేసిన సోనియాగాంధీ తిరిగి దానిని పొంగులేటికి ఇవ్వకుండా తనతో పాటు తీసుకుని వెళ్లిపోయారు. సీమాంధ్ర నాయకులతో కలిసి మెలసి జీవించాలని ఆమె తెలంగాణ నాయకులకు సూచించారు.
కాగా, శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్తోను, సాయంత్రం టెన్ జన్పథ్లో సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీతోనూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు సమావేశమయ్యారు. వి హనుమంతరావు ఇంట్లో రంగులు చల్లుకుని, మిఠాయిలు పంచుకున్నారు.
కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జెఎసి నాయకులు సోనియాను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకుగాను కీలకమైన నిర్ణయం తీసుకున్నారని సోనియాను కోదండరామ్ అభినందించారు. ఇది కీలకమైన నిర్ణయమని తనకు కూడా తెలుసునని ఆమె అన్నారు. పావు గంటకు పైగా సోనియాతో ఉద్యోగ సంఘాల నాయకులంతా మాట్లాడారు. ఆమె కూడా చాలా సంతోషంగా, ఉల్లాసంగా వారితో గడిపారు.