కవిత అవమానిస్తే ఏంచేశావ్: సెల్యూట్పై కేసీఆర్కు
హైదరాబాద్: తెలంగాణ గడ్డ మీద బతకదల్చుకుంటే తమకు సెల్యూట్ కొట్టాలని, లేకపోతే పాతరేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తన కూతురు కవిత దేశాన్ని అవమానిస్తే ఏం చేశారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి శనివారం ప్రశ్నించారు.
కాశ్మీర్, హైదరాబాద్ ప్రత్యేక దేశాలని పార్లమెంటులోనే ఎంపీ కవిత మాట్లాడటం దేశాన్ని అవమానపర్చినట్లుగా అనిపించలేదా అని ప్రశ్నించారు. టీవీ చానళ్ల ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లు నిలిపివేశారని, ఏదైనా ఉంటే వారితో మాట్లాడుకోండని కేసీఆర్ అనడం దుర్మార్గమన్నారు. సీఎం వాహనాల రంగు మార్చడం కాకుండా.. తెలంగాణ ప్రజల బతుకులు మార్చాలని కోరారు.
కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణకు చేటు జరుగుతోందని, ఆయన చేస్తున్న ప్రకటనలపై తక్షణం వివరణ ఇవ్వాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ వేరుగా అన్నారు. శనివారం ఏపీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలయిందని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, కేసీఆర్ ప్రకటనలతో అనుమానాలు పెరిగాయని అన్నారు.
వందరోజుల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అవసరమయ్యే పని ఒక్కటైనా చేయలేదని దత్తాత్రేయ మండిపడ్డారు. తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలు, ప్రకటనల కారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. చట్టబద్ధత లేని అంశాలు చేపడుతూ ప్రభుత్వం సాధించింది శూన్యమని వాపోయారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో రెండు ప్రభుత్వాల వైఖరి వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. విద్యుత్ విషయంలో తొలుత చంద్రబాబు అనుసరించిన వైఖరి కూడా సమర్థనీయం కాదన్నారు. పరస్పర విశ్వాసం, ఆత్మీయతతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవహరించాలని హితవు పలికారు. మెదక్ ఉప ఎన్నికపై స్పందిస్తూ.. బీజేపీ గట్టి పోటీనిచ్చిందని, టీఆర్ఎస్ మెజారిటీ భారీగా తగ్గిపోతుందని దత్తాత్రేయ అన్నారు.