విజయానందతో జగన్ 2గంటలు భేటీ అయ్యారా?
హైదరాబాద్: ఎర్ర చందనం స్మగ్లర్గా పేరు మోసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విజయానంద రెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు చర్చనీయాంశమవుతున్నాయట. ఈ ఏడాది జనవరి 23న సమైక్య శంఖారావయాత్ర సందర్భంగా విజయానంద రెడ్డితో జగన్ రెండున్నర గంటలపాటు చర్చలు జరిపిన అంశం కలకలం రేపుతోందని ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడులో కథనం వచ్చింది.
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నిందితుడు ఇతోధికంగా ఆర్థిక సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయట. శేషాచలం అడవులలో రూ.కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాలో విజయానంద రెడ్డిది పైచేయి అంటున్నారు. చిత్తూరు జిల్లా ఎస్సార్ పురం మండలం కొత్తపల్లెమిట్ట పంచాయతీ కొటార్లపల్లెకు చెందిన విజయానంద రెడ్డి ఎర్ర స్మగ్లర్గా ముద్రపడ్డారు.
ఇటీవలె పోలీసులు ఆయనను అరెస్టు చేసి పీడీ యాక్టు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ ఏడాది జనవరి 23న జగన్ సమైక్య శంఖారావం యాత్రను ఎస్సార్ పురం మండలంలో నిర్వహించారు. ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆయన మండలంలోని కొటార్లపల్లెలో ఉన్న విజయానంద రెడ్డి ఇంటికి వెళ్లారని, రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు అక్కడే ఉండి, మంతనాలు జరిపారట.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విజయానంద రెడ్డి జిల్లా పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. ఆయన తన తల్లిని కొత్తపల్లె సర్పించిగా ఏకగ్రీవం చేసేందుకు చక్రం తిప్పారట. సార్వత్రిక ఎన్నికలలోను విజయానద రెడ్డి ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు పెట్టుబడి పెట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయట. అందులో ఇద్దరు గెలిచారట. విజయానంద రెడ్డి పైన సిబిఐ విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.