పోరాడుతాం: ఉద్యోగం అడిగితే ఇవ్వలేమన్న జగన్!
హైదరాబాద్: తాము ఉద్యోగాలు ఇవ్వలేమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. చెన్నైలో ఇటీవల బహళ అంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన 24 మంది కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం విజయనగరం జిల్లాకు వచ్చిన జగన్ తొలిరోజు దత్తిరాజేరు, బాడంగి మండలాల్లో కొన్ని కుటుంబాలను పరామర్శించారు.
రాత్రి బొబ్బిలిలో బసచేసిన ఆయన రెండో రోజు బుధవారం మక్కువ, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో పర్యటించినప్పుడు బాధిత కుటుంబీకులు తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. దీనిపై జగన్ స్పందిస్తూ ప్రతిపక్షంలో ఉన్న తాము ఉద్యోగాలు ఇప్పించలేమన్నారు. తాము ఉద్యోగాలైతే ఇవ్వలేమని, ప్రతిపక్షంలో ఉన్నామని, ఏదైనా సమస్య ఉంటే దాని మీద పోరాడతామన్నారు. మీకు అండగా ఉంటామన్నారు.
ప్రభుత్వం నుంచి మీకు సాయం ఏమైనా అందిందా.. ఎంత మొత్తం అందింది.. చెన్నై ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిందా.. అని ఆరా తీశారు. అలాగే చెన్నైలోని భవన యజమాని నుంచి కూడా పరిహారం అందేలా పోరాటం చేస్తానన్నారు. మక్కువ మండలం గైశిల, తూరుమామిడి గ్రామాల్లో బాధిత కుటుంబీకులైన సత్యనారాయణ, తిరుపతిరావులను కలుసుకొని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
సీతానగరం, పార్వతీపురం మీదుగా కొమరాడ చేరుకున్నారు. మాదలింగిలో జాన్ కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ నుంచి జియ్యమ్మవలస మండలం నీలమాంబపురంలో ఐదు బాధిత కుటుంబాలను కలుసుకొని వారిని ఓదార్చారు. అక్కడినుంచి వీరఘట్టం మీదుగా శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు.