రేవంత్ది తేలాకే తేల్చుతాం: టీడీపీకి బీజేపీ 'గ్రేటర్' షాక్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి వ్యవహారంలో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పైన తెలంగాణ భారతీయ జనతా పార్టీ మెలిక పెట్టింది! రేవంత్ ఓటుకు నోటు కేసులో తప్పొప్పులు తేలాకే టీడీపీతో పొత్తు కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఓటుకు నోటు కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పత్రికా క్లిప్పింగులు, ఇతర వివరాలతో నివేదికను కేంద్రానికి పంపించామన్నారు. బీజేపీ నైతిక విలువలతో కూడుకున్న పార్టీ అని, రాజకీయాల్లోనూ నైతిక విలువలు పెరగాలని కోరుకుంటుందన్నారు.
అయితే నోటుకు ఓటు కేసును ఏసీబీ పరిశోధిస్తున్నదని, ప్రస్తుతం ఇది న్యాయస్థానంలో ఉందని, అక్కడ తప్పో ఒప్పో తేలాక టీడీపీతో పొత్తుపై ఆలోచిస్తామని చెప్పారు.
కాగా, త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీతో పొత్తును తెలంగాణ బీజేపీ మొదటి నుండి వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు కూడా బీజేపీకి టీడీపీతో పొత్తు ఇష్టం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ధీటుగా నిలవాలంటే ఒంటరిగా వెళ్లాలని భావిస్తోంది.
ఈ సమయంలో రేవంత్ రెడ్డి ఇష్యూ తెలంగాణ బీజేపీకి అందివచ్చిన అంశంగా కనిపిస్తోంది. ఎప్పటి నుండి టీడీపీకి దూరంగా ఉందామనుకుంటున్న తెలంగాణ తెలుగుదేశం ఈ అంశంతో ఆ పార్టీకి దూరం జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే, అధిష్టానాన్ని ఏమేరకు ఒప్పిస్తారో చూడాల్సి ఉంది.