'ప్రత్యేక హోదా కోరట్లేదు, అది పవన్ కళ్యాణ్ మాట'!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు శనివారం విశాఖలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రత్యేక హోదాను రాష్ట్ర ప్రజలు కోరుకోవట్లేదన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రత్యేక హోదాపై రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు శాపాలుగా మారాయన్నారు. అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని మీడియా సైతం బూతద్దంలో చూపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
తాము కలిసే పనిచేస్తున్నామని, తమ మధ్య విభేదాలు లేవన్నారు. భవిష్యత్లో కూడా కలిసే పని చేస్తామన్నారు. అయితే కొంతమంది టీడీపీ వారు చేస్తున్న వ్యాఖ్యలపై తాను మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. భూసేకరణ బిల్లుపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు ఆయన వ్యక్తిగతమన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న భూసేకరణ తీరుపై పవన్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న అంశంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడంపైనే తమకు సందేహాలున్నాయన్నారు.