వివాదం:అసెంబ్లీలో వైష్ణోదేవిపై బిజెపి సభ్యుడి ప్రమాణం!
శ్రీనగర్: భారతీయ జనతా పార్టీ సభ్యుడు రవీందర్ రైనా మాతా వైష్ణోదేవిపై ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో వివాదాస్పదంగా మారింది. జమ్మూకాశ్మీర్ 12వ అసెంబ్లీ తొలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది. నౌషీరా స్థానం నుంచి ఎన్నికైన రవీందర్ రైనా మాతా వైష్ణోదేవిపై ప్రమాణం చేస్తుండగా సిపిఎం సభ్యుడు వై తరిగామి అభ్యంతరం వ్యక్తంచేశారు.
నిర్దేశిత నమూనాలో దేవుడిపై మాత్రమే ప్రమాణం చేయాలని పట్టుబట్టారు. మాతా వైష్ణోదేవిపై ప్రమాణం చేయాలని నమూనా పత్రంలో లేదన్నారు. దీనికి విపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ సభ్యులు మద్దతు పలికారు. ప్రొటెం స్పీకర్ మహ్మద్ షఫీ జోక్యంచేసుకుని దేవుడిపై ప్రమాణం చేయాలని సభ్యుడికి సూచించారు.

తాను వైష్ణోదేవి భక్తుడినని, ఆమెపై ప్రమాణంచేసేందుకు అనుమతించాలని రవీందర్ రైనా కోరారు. కొందరు సభ్యులు అల్లా, జీసస్ పేర్లపై ప్రమాణంచేసినప్పుడు.. తాను మాతా వైష్ణోదేవిపై ఎందుకు ప్రమాణం చేయకూడదని వాదించారు. దీనికి సందర్శకుల గ్యాలరీ నుంచి మద్దతు లభించింది. అయితే విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. దీంతో డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ జోక్యం చేసుకుని రైనాకు నచ్చజెప్పారు.
ఆ తర్వాత రవీందర్ రైనా దేవుడిపై ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అంతకుముందు జమ్మూకాశ్మీర్ 12వ అసెంబ్లీ మంగళవారం కొలువుదీరింది. తొలిరోజు ముఖ్యమంత్రి ముఫ్తీ సయీద్ సహా 85మంది సభలో ప్రమాణస్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications