మార్ఫింగ్: వాట్సప్లో స్మృతి ఇరానీ అసభ్యకర చిత్రం
పాట్నా: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అసభ్యకర చిత్రాన్ని వాట్సప్లో పోస్ట్ చేశారన్న ఆరోపణల పైన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)కి చెందిన నాయకుడి పైన పోలీసులు శనివారం కేసు పెట్టారు. ఇందుకు సంబంధించి పలువురు ఎల్జేపీ నేతలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
మార్ఫింగ్ చేసిన స్మృతి ఇరానీ అసభ్యకర చిత్రాన్ని పోస్ట్ చేశారంటూ స్థానిక భారతీయ జనతా పార్టీ నేత రాజీవ్ రంజన్ తమకు ఫిర్యాదు చేశారని బీహార్ రాష్ట్రంలోని సమస్తిపుర్ ఎస్పీ సురేష్ ప్రసాద్ చౌదరి శనివారం చెప్పారు. సమస్తిపుర్ జిల్లా ఎల్జేపీ అధ్యక్షుడు ఉమాశంకర్ మిశ్రా సెల్ఫోన్ నుండి సదరు ఫోటో అప్ లోడ్ అయినట్లు గుర్తించినట్లు చెప్పారు.
దీంతో ఉమాశంకర్ మిశ్రాతో పాటు పలువురు నాయకులను విచారిస్తున్నామని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ, ఎల్జేపీల మధ్య విభేదాలు సృష్టించే కుట్రలో భాగంగానే ఎవరు తన సెల్ఫోన్ను ఇలా దుర్వినియోగం చేశారని ఉమాశంకర్ మిశ్రా చెబుతున్నారు.
ఇందుకు సంబంధించి తాము ఆధారాలను పోలీసులకు సమర్పించామని బీజేపీ నేత రాజీవ్ రంజన్ తెలిపారు. బీజేపీ, స్మృతి ఇరానీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా చేశారని ఆయన అన్నారు. దీనిపై ఎల్జేపీ చీఫ్, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్.. తమ పార్టీ నేత మిశ్రా పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు, ఇది తనకు తెలియదని మిశ్రా అంటున్నాడు.