కాంగ్రెస్కు మరో షాక్: టిఆర్ఎస్లోకి మాజీ ఎమ్మెల్సీ?
ఆదిలాబాద్: తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి దెబ్బ మీ దెబ్బ పడుతోంది. తాజగా, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు త్వరలోనే అధికారపార్టీలో చేరవచ్చనే ప్రచారం జోరందుకొంది. పుష్కరాల తరువాత చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని వినికిడి. పదేళ్లపాటు కాంగ్రెస్ పాలనలో జిల్లాలో ప్రేంసాగర్రావు బలమైనవర్గాన్ని ఏర్పరుచుకున్నారు.
ప్రేంసాగర్రావు గత సార్వత్రిక ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీచేసి ఘోర పరాభవం చవిచూశాడు. ఆసిఫాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం ఓడిపోవడం సాగర్రావు వర్గాన్ని రాజకీయంగా దెబ్బతీసిందనే చెప్పొచ్చు. ఎన్నికల నాటి నుంచి రాజకీయాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్న ఈ మాజీ ఎమ్మెల్సీ వైఖరి ఆయన సందిగ్ధంలో పడేసింది. దీంతోపలువురు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలకు అధికార టిఆర్ఎస్ నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.
కొంత మంది ప్రేంసాగర్రావు మద్దతుదారులు ఎన్నికలకు ముందు, ఆ తరువాత అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ పంచన చేరారు. ఈ స్థితిలో ఇటీవలి కాలంలో తిరిగి ప్రేంసాగర్రావు పేరు చర్చల్లో నిలుస్తోంది. త్వరలోనే ఆయన అధికార పార్టీలో చేరవచ్చనే ప్రచారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దివంగత వైఎస్ హయాంలో కీలకపాత్ర పోషించిన ఓ ముఖ్య నేత టిఆర్ఎస్లో చేరేందుకు ప్రేంసాగర్కు మార్గం సుగమం చేశాడనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే ప్రేంసాగర్ రావుతో పాటు ఆయన సతీమణి కొక్కిరాల సురేఖకు సైతం పదవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే ప్రేంసాగర్ రావు చేరుతారనే ప్రచారాన్ని ఆయన సన్నిహితులు మాత్రం కొట్టిపారేస్తున్నారు.