బాబు విదేశీ టూర్పై నమస్తే తెలంగాణ 'చిత్ర' భాష్యం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటనపై నమస్తే తెలంగాణ దినపత్రిక చిత్రమైన భాష్యం చెప్పింది. నోటుకు ఓటు కేసుకు ఆయన పర్యటనను ముడిపెట్టి ఓ వార్తాకథనాన్ని అల్లింది. ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారిందంటూ వ్యాఖ్యానించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన వేం నరేందర్రెడ్డి విచారణ పూర్తికావడంతో కేసు విచారణ వేగవంతం కావడం, ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ నివేదిక రావడం, సండ్ర, జిమ్మీకి ఏసీబీ తాజాగా నోటీసులు జారీచేసిన నేపథ్యంలో చంద్రబాబు పర్యటన పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ వ్యాఖ్యానించింది.
మంత్రులు, ఉన్నతాధికారుల బృందంతో బయలుదేరి వెళ్లిన చంద్రబాబు మూడురోజులపాటు జపాన్లో, రెండురోజులపాటు హాంకాంగ్లో పర్యటించి ఈ నెల 10న తిరిగి రానున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు సూత్రధారి అయితే ఎమ్మెల్యే రేవంత్రెడ్డి పాత్రధారి అన్న ఆరోపణలున్నాయని, అంతేకాకుండా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని నమస్తే తెలంగాణ దినపత్రిక రాసింది.
ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నా.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో లెక్కలు చూపడంలేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది. విదేశీ పర్యటనల పేరుతో ఇప్పటి వరకు చంద్రబాబు దాదాపు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, అసలే రాష్ట్రం ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతుంటే ఆయన ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని విమర్శిస్తున్నాయని నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది.