పాక్ ప్రజలంతా టెర్రరిస్ట్స్ కారు: రాజ్నాథ్, టెర్రర్ ట్విస్ట్
హరిద్వార్: పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులుకారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం నాడు హరిద్వార్లో అన్నారు. పాకిస్తాన్లో ఎన్నో విజయవంతమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ అవి ఉగ్రవాదులను అణిచివేయడంలో విఫలం అయ్యాయన్నారు.
చాలామంది ఎప్పటికప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారని, అయితే అధికారంలో ఉన్న నేతలు సరైన వైఖరి అవలంభించడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినా ఉగ్రవాదంపై పోరులో చర్చలు ఎప్పడూ స్పష్టంగా లేవని, ఆరు నెలలుగా పాక్ చేస్తున్న రకరకాల దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్నారు.
సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాల పైన పక్క దేశాలతో ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు ప్రత్యుత్తరాలు జరుపుతున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నుండి మంచి నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా పర్యటన అనంతరం విదేశీ పెట్టుబడులు వస్తాయని, కొద్ది రోజుల్లోనే దేశ ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుందన్నారు. ఉత్తమ ఆతిథ్య దేశమైన భారత్ మర్యాదలను అమెరికా అధ్యక్షులు చవిచూడనున్నారని వ్యాఖ్యానించారు.
జమాత్ ఉద్ దవాపై పాకిస్తాన్ ట్విస్ట్
ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా (జేయూడీ)ని నిషేధించలేదని, కొన్ని చర్యలు మాత్రం తీసుకున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది.
జేయూడీని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా 2008 డిసెంబరులో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ తర్వాత జేయూడీ బ్యాంకు ఖాతాల స్తంభన, ఆయుధాలపై ఆంక్షలు, విదేశాలకు ప్రయాణాలపై నిషేధం వంటి చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, నిషేధం మాత్రం విధించలేదని చెప్పాయి.












Click it and Unblock the Notifications