'డ్రగ్స్తో పట్టుబడ్డ రాహుల్, విడిపించిన వాజపేయి'
జోద్పూర్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. లలిత్ మోడీ వివాదంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. బిజెపిని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీ మొదట తమ విషయాన్ని చూసుకోవాలని ఎద్దేవా చేశారు.
2001లో రాహుల్ గాంధీ అమెరికాలో డ్రగ్స్తో ఉండగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) అధికారులు పట్టుకున్నారని, ఆ సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వేడుకోవడంతో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కల్పించుకొని విడిపించారని షాకింగ్ ఆరోపణ చేశారు.
రాహుల్ గాంధీ వద్ద 1.6 లక్షల డాలర్ల విలువైన వైట్ పౌడర్ దొరికిందని ఆరోపించారు. నాటి అమెరికా అధ్యక్షులు జార్జ్ బుష్కు స్వయంగా ఫోన్ చేసిన వాజపేయి ఆయనను విడిపించాలని కోరారని, అందుకు బుష్ అంగీకరించారని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
బిజెపి మంత్రులు, ముఖ్యమంత్రుల మీద ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ తన తప్పులను తెలుసుకోవాలని హితవు పలికారు. వసుంధర రాజేను ఝాన్సీ కీ రాణీగా ఆయన అభివర్ణించారు. ఏ వివాదం నుంచి అయినా ఆమె సొంతగా బయటపడగలరన్నారు.
రాజేకు ఎవరూ మద్దతుగా మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. ఆమె నేరం చేయాలని ప్రయత్నించలేదని, కేవలం మానవత్వాన్ని చూపారన్నారు. రాజే తనయుడు దుష్యంత్ ఏదైనా తప్పు కాంగ్రెస్ పార్టీ కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ కోర్టుకెళ్లి అతనిని దోషిగా తేల్చాలన్నారు.