జైలు గది కోసం అతను రూ. 1.23 కోట్లు
న్యూఢిల్లీ: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అంటారు. కోటీశ్వరులు తలుచుకుంటే జైలులోకి కూడా స్వర్గం దిగి వస్తుందని తాజా సంఘటన తెలియజేస్తోంది. సహారా గ్రూప్ సంస్థల అధినేత సుబ్రతా రాయ్ తీహార్ జైలులో గత ఏడాది కాలం తాను ఉన్న లగ్జరీ గది కోసం రూ.1.23 కోట్లు చెల్లించుకున్నారని సమాచారం.
ఎసి గది, ల్యాప్ టాప్లు, ల్యాండ్ ఫోన్లు, పిఎ, వీడియో కాన్ఫరెన్స్ తదితర సౌకర్యాలను ఆయనకు కల్పించారు. సహారా సంస్థ ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు అక్రమమని సెబీ తేల్చిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది.
లండన్లోని సహారా హోటళ్లను విక్రయించుకునేందుకు వీలుగా దేశీయ, విదేశీ వ్యాపారవేత్తలతో చర్చలు చేసేందుకు సుబ్రతా రాయ్కి జైలు గదిలో ప్రత్యేక వసతులు కల్పించారు. బెయిల్ కావాలంటే రూ. 5 వేల కోట్ల నగదు, మరో రూ. 5వేల కోట్లకు చెక్కులను ఆయన ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పుడు సుబ్రతా రాయ్ తీహార్ జైలులోని సాధారణ గదికి నవంబర్లో మారారు. ఆయన నిరుడు మార్చి 4వ తేదీన తీహార్ జైలుకు వచ్చారు. అతను లగ్జరీ గదిలో ఉన్నప్పుడు ఆయన కుమారుడిని, కొంత మంది కంపెనీ డైరెక్టర్లను కూడా అనుమతించారు. సమావేశాలను సిసిటీవీలో రికార్డు చేసారు. తిరిగి నవంబర్ 12వ తేదీన సాధారణ గదికి మారారు.