కెసిఆర్తో ఎర్రబెల్లి భేటీ మతలబు ఏమిటి?
వరంగల్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేత (టిడిఎల్పీ) నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలుసుకోవడంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణలో టిడిపి రోజురోజుకూ క్షీణిస్తున్న దశలో ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్ను కలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అంటున్నారు.
తెలంగాణ టిడిపిలో ఎవరికి వారే యమునా తీరే అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. పార్టీ పరిస్థితి నామమాత్రం కావడమే ఎర్రబెల్లి కెసిఆర్తో సమావేశం కావడం వెనక మతలబు అయి ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది. అయితే సమీక్ష సమావేశంలో చర్చ సందర్భంగా అభివృద్ధి పనుల విషయంలో తనను కలిసి ప్రతిపాదనలు ఇవ్వాలని కెసిఆర్ సూచించారని, అందుకే కలిశానని ఎర్రబెల్లి అంటున్నారు.
కెసిఆర్ మంగళవారం సాయంత్రం వరంగల్ జిల్లా అభివృద్ధిపై హన్మకొండలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో చేసిన సూచన మేరకు తాను కెసిఆర్ను కలిసి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని, అందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరినట్లు ఎర్రబెల్లి చెప్పారు.
కాగా, కెసిఆర్ మూడు రోజుల వరంగల్ జిల్లా పర్యటన బుధవారం సాయంత్రం ముగుస్తుంది. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో కెసిఆర్ బస చేస్తున్నారు. అక్కడే బుధవారంనాడు ఎర్రబెల్లి కెసిఆర్ను కలిశారు.