ఏమైంది?: లేచిపోయి పెళ్లి చేసుకున్న వివాహిత మహిళలు!
జైపూర్: వారిద్దరూ వివాహిత మహిళలు. అయితే, వారి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో తాము వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. తమను ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించరని తెలిసి.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ వింత ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జైపూర్కు చెందిన సోనియా(27), మమత(26)లు ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో నివాసముండేవారు. వీరిద్దరికీ తమ భర్తలతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అంతేగాకుండా ఆ వివాహితలకు చెరో సంతానం కూడా ఉన్నారు. వారి భర్తలు రోజువారి పనిలో భాగంగా విధులకు వెళ్లేవారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న వీరిద్దరూ ఒకేచోట చేరి ఎక్కువ సమయాన్ని గడిపేవారు.
ఈ క్రమంలో ఒకరిని ఒకరూ బాగా అర్థం చేసుకున్నారో లేక అభిప్రాయాలే నచ్చాయో తెలియదు కానీ వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతే ఇద్దరూ కలిసి వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ ఇద్దరు వివాహితలు తమ తమ కుటుంబాలను వదిలిపెట్టి పెళ్లి చేసుకోవాలని భావించారు.
మన్సరోవర్ గ్రామంలోని ఓ ఆలయంలో ఈ మహిళలు ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వాళ్లు పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లు ప్రకారం.. సోనియా భర్తగా, మమతా భార్యగా వ్యవహరించారు. వారిరువురి కుటుంబాలకు దూరంగా వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆరు నెలల తర్వాత మమత సోదరుడు వీరిద్దరు కలిసి నివాసం ఉంటున్న చోటును కనుగొన్నాడు. వారి దగ్గరికి వెళ్లి 'మీ' వివాహనికి ఇరు కుటుంబాలు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాయని నమ్మించి, ఇంటికి రావాల్సిందిగా కోరాడు.
ఈ నేపథ్యంలో వారిద్దరూ స్వగ్రామానికి తిరిగివచ్చారు. అయితే, మొదటి వివాహానికి సంబంధించి ఇరువురి అత్తలు సోనియా(భర్తగా చెప్పుకునే మహిళ)ను చితకబాది, ఊరి నుంచి తరిమికొట్టారు. కాగా, సోనియా వెళ్లిన తర్వాత మమతా కూడా కనిపించకుండా పోయింది. ఈ సంఘటన రాజస్థాన్లోని టోన్క్ జిల్లాలోని అమ్లీ గ్రామంలో చోటు చేసుకుంది.
తన భాగస్వామి మమత జాడ కోసం సానియా అన్ని ప్రాంతాల్లో వెతుకుతూనే ఉంది. తామున్న చోటు ఎవరికీ తెలియకుండా ఉండటానికి మమత కుటుంబ సభ్యులు ఇంటిని కూడా వదిలి పోవడంతో.. తన తోడు కోసం వెతికి వెతికి నీరసించి చివరకు డిగ్గి పోలీస్స్టేస్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది.
స్వలింగ వివాహాలు చెల్లుతాయని, వారి విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని నిరూపించడానికి న్యాయ సహాయం కోసం కోర్టు మెట్లు కూడా సానియా ఎక్కింది. దీంతో కోర్టు మమత కుటుంబసభ్యులకు లీగల్ నోటీసులు పంపింది. మమత కోరికలు నెరవేర్చడానికి తన ఇంటిని కూడా అమ్మేసినట్టు సోనియా చెబుతోంది. మమతా ఆచూకీ గనుక దొరక్కపోతే తనకు ఆత్మహత్య తప్ప వేరే దారిలేదని ఆవేదనగా చెబుతోంది.