నా పరిధిలో జోక్యం వద్దు: సుప్రీం కోర్టుకు హైకోర్టు జడ్జి
చెన్నై: భారత దేశ న్యాయవ్యవస్థలో ఇటీవలి కాలంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఘటనలు సోమవారం చోటుచేసుకున్నాయి. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల్ని ఓ హైకోర్టు జడ్జి నిలిపివేయడమే కాకుండా తన పరిధిలో జోక్యం చేసుకోవద్దని, తనకు వివరణ ఇవ్వాలని ఏకంగా సిజెఐకే సూచించారు.
చివరికి ఆ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఢిల్లీ, చెన్నై మధ్య పలుపరిణామాలు వేగంగా సంభవించాయి. మద్రాస్ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ స్ఎస్ కర్ణన్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయటానికి సంబంధించిన ప్రతిపాదనపై సిజెఐ ఈ నెల 12న ఆదేశాలు జారీ చేశారు.
దీనిని జస్టిస్ కర్ణన్ సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టనున్నారన్న సమాచారంతో.. మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్తో పాటు ప్రముఖ లాయర్ వేణుగోపాల్ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ కెఎస్ ఖేహర్, జస్టిస్ భానుమతితో కూడిన ధర్మాసనం... జస్టిస్ కర్ణన్కు ఎటువంటి వ్యవహారాలు అప్పగించవద్దని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ను ఆదేశించింది.
ఓ వైపు ఈ వ్యవహారం జరుగుతుండగానే.. ఆ సమయంలో తన బదలీకి సంబంధించి సిజెఐ జారీ చేసిన ఉత్తరవులు జస్టిస్ కర్ణన్ సుమోటాగా స్వీకరించి విచారణ జరిపారు. తన బదలీ పైన స్టే విధించారు. ఇలా మన దేశ న్యాయవ్యవస్థలో పైకోర్టు తీర్పును.. అందులోను సుప్రీం కోర్టు తీర్పును కిందికోర్టు కొట్టివేసిన సంఘటన జరిగింది.
కానీ జస్టిస్ కర్ణన్ సుప్రీం కోర్టు ఆదేశాల పైన స్టే విధించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన 1993లో సుప్రీం కోర్టు 9 మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. తన పరిధిలో జోక్యం చేసుకోవద్దని, ఈ అంశంపై ఏప్రిల్ 29లోగా మద్రాస్ హైకోర్టుకు ఎవరితోనైనా లిఖితపూర్వక వివరణ పంపించాలని సిజెఐకి జస్టిస్ కర్ణన్ సూచించారు. దీనిపై సుప్రీం కోర్టు సోమవారం స్టే విధించింది.
దీనిపై జస్టిస్ కర్ణన్ మాట్లాడుతూ.. విధులు చేపట్టకుండా తనను నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఇద్దరు సుప్రీం కోర్టు జడ్జిలు పైన ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెన్నై నగర పోలీసు కమిషనర్ను ఆశ్రయిస్తానని చెప్పారు. ఆయన సోమవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.
ఏం జరిగింది?
2014 ఆగస్టులో తమిళనాడు రబ్లిక్ సర్వీస్ కమిషన్.. 162 సివిల్ జడ్జి పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టింది. సెలక్షన్ కమిటీకి ఎంపికైన జడ్జిల్లో జస్టిస్ ధనపాలన్ ఉన్నారు. దీనిపై జస్టిస్ కర్ణన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఇదే అంశంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తీర్పును వెలువరించారు.
ఈ తీర్పును జస్టిస్ కర్ణన్ రద్దు చేస్తూ తాత్కాలికంగా ఉత్తర్వులు ఇచ్చారు. దళిత న్యాయమూర్తినైన తనను వేధించినందుకు జస్టిస్ కౌల్ పైన ఎస్సీ, ఎస్టీ వేధఇంపుల నిరోధక చట్టం కింద కేసు పెడతానని, కోర్టు ధిక్కరణ కేసు వేస్తానని జస్టిస్ కర్ణన్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో సివిల్ జడ్జీల నియామకాలకు సంబంధించి జస్టిస్ కర్ణన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు రిజస్ట్రార్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు గత ఏడాది మే నెలలో జస్టిస్ కర్ణన్ తీర్పును నిలిపేసింది.