చంద్రబాబుకు '2019' చిక్కులు: తెరపైకి 'జూ.ఎన్టీఆర్'?
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 2019 ఎన్నికల నాటికి మళ్లీ 'జూనియర్ ఎన్టీఆర్' చిక్కు వస్తుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏ రూపంలోనైనా 'జూ ఎన్టీఆర్' పేరు తెరపైకి వస్తే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఇందుకు వివిధ కారణాలు కూడా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. హరికృష్ణ మరోసారి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు వినిపించడం, కొడాలి నాని ఆయనను ఇటీవల కలవడం, నాని టిడిపిలో చేరుతారనే ప్రచారం జరగడం.. ఇన్నింటి పైన కూడా రాజకీయంగా చర్చ సాగుతోంది.
హరికృష్ణ మరోసారి టిడిపి తరఫున రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనకు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని, మరొకరు ఎవరైనా వస్తారని అంటున్నారు. అదే సమయంలో కొడాలి నాని పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బాబు నో చెప్పినట్లుగా వార్తలొచ్చాయి.

చంద్రబాబు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను ముందే ఊహించి.. వారికి చెక్ చెప్పే ప్రయత్నాల్లో భాగంగానే 'నో' చెప్పారనే వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం టిడిపి వారసత్వం విషయంలో ఎన్టీఆర్, నారా లోకేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత లోకేష్ వ్యూహాత్మకంగా టిడిపిలో కీలక నేతగా ఎదిగారు.
అయితే, హరికృష్ణకు లేదా ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇస్తే మరోసారి చిక్కులు వస్తాయని చంద్రబాబు భావిస్తుండవచ్చునని అంటున్నారు.
వారికి ప్రాధాన్యం ఇచ్చినా, ఇవ్వకపోయినా.. 2019 ఎన్నికల నాటికి మరోసారి జూ ఎన్టీఆర్ పేరు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అసంతృప్తితోనో, వారసత్వం విషయంలోనో హరికృష్ణ తన తనయుడి పేరును తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోసారి వారసత్వం, అసంతృప్తులకు అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు ముందుకెళ్లాలని భావిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications